Revanth Reddy: తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలుతుంటే ఆయన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ళ కోసమే తాను గట్టిగా మాట్లాడట్లేదని ఎ.పి సిఎం జగన్ చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తండ్రి ని తిడితే నోరు మెదపలేని జగన్ ముఖ్యమంత్రిగా ఏ.పీ కి ఏం న్యాయం చేస్తారంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.మరోవైపు వైఎస్ ను తిడితే ఆయన భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల కూడా మౌనం వహిస్తుండటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.వైఎస్సార్ ను తెలంగాణ మంత్రులు తిట్టే వరకు పరిస్థితి రావడానికి కారకుడైన జగన్ ను విజయమ్మగాని,షర్మిలగానీ ఎందుకు నిలదీయడం లేదని ఆయన సూటిగా అడిగారు.
వైఎస్ఆర్ పై ప్రశంసల వర్షం!
అదే సమయంలో రేవంత్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రజల సంక్షేమాన్ని కోరుకున్న నేతలెవరైనా ఉంటే అది ఎన్టీఆర్ ,వైఎస్ రాజశేఖరరెడ్డి లు మాత్రమేనని ఆయన చెప్పారు.అలాంటి వారిని తిడితే …కుష్ఠు రోగం వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.వైఎస్సార్ రైతు సంక్షేమానికి పాటుపడిన నాయకుడని కూడా ఆయన కితాబిచ్చారు.అలాంటి రాజశేఖర్రెడ్డి ఎందుకు ఒక్కసారిగా తెలంగాణ మంత్రుల దృష్టిలో విలన్ గా మారిపోయాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం జగన్ కి లేకపోయినా విజయమ్మకు,షర్మిలకు ఉందని ఆయన చెప్పారు.ఒకప్పుడు కేసీఆర్ ఎంతో ఆప్యాయంగా జగన్ ను తన ఇంటికి పిలిచి విందు ఇచ్చాడని,ఇప్పుడాయన ఎందుకు బద్ధశత్రువు అయ్యాడని రేవంత్ ప్రశ్నించారు.అసలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ను విమర్శించకుండా మరణించిన రాజశేఖర్రెడ్డిని దూషించటంతో అర్థమేముందని ఆయన అన్నారు.
షర్మిలకు హితవు!
ఇద్దరు ముఖ్యమంత్రులు సాగిస్తున్న రాజకీయ క్రీడలో షర్మిల పావుగా మారిందని రేవంత్ పేర్కొన్నారు.గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.జల వివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ ఇదంటూ రేవంత్ ఆరోపించారు. కృత్రిమ యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.వారం రోజుల్లో సొంతంగా పార్టీ పెట్టబోతున్న షర్మిల ఈ కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మెలగాలని రేవంత్రెడ్డి సలహా ఇచ్చారు.