గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీలో కుదుపులకు కారణం అవుతోంది. గ్రేటర్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ పీఠం ఖాళీ కావడంతో…ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అన్న ఆసక్తి మొదలైంది. ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీపీసీసీ చీఫ్ ఎవరికి దక్కేది?
తెలంగాణ కాంగ్రెస్ రథసారథి మార్పు విషయంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర ఓటమి తర్వాత నాయకుడిని మార్చాలన్న వాదనకు బలం చేకూరింది. ఇక గ్రేటర్లో దారుణ పరాజయం నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కులాలు , మతాలు , సీనియారిటీ ఆధారంగా పేర్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.
జాబితాలో వీళ్లే …
పీసీసీ పీఠం కోసం సీనియర్ నేతలు రేవంత్రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్బాబు పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక బీసీ నాయకులు సైతం ఈ సారి పీసీసీ పీఠంపై గురిపెట్టారు. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి కాకుండా ఈ సారి తమకే అవకాశం ఇవ్వాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ నేతల్లో తానే సీనియర్ను అని.. అందువల్ల తనకే పీసీసీ పీఠం కట్టబెట్టాలని కోమటి రెడ్డి గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్బాబుకు సౌమ్యుడిగా ముందు నుంచి అధిష్టానం దగ్గర మంచి పేరు ఉంది . అయితే, వీరిలో దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి పేరే పీసీసీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
రేవంత్ కీలక నిర్ణయం
పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని రేవంత్ సహా ఆయన వర్గం ఎంతో ఆశలతో ఉంది. ఒకవేళ ఆ పదవి కట్టబెట్టని పక్షంలో రేవంత్ టీపీసీసీ కార్యనిర్వాహక పదవికి సైతం గుడ్ బై చెప్తారని అంటున్నారు. ఇప్పటికే రాజీనా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ అయ్యేదెవరు? రేవంత్ సంచలన నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.