విశాఖలోని గీతం యూనివర్శిటీకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గీతం మెడికల్ కళాశాల మైదానంలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు దాని చుట్టూ కంచె వేశారు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. కళాశాల నిర్మాణాలు తొలగింపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసు అధికారులు సిబ్బంది అక్కడ బందోబస్తు కొనసాగిస్తున్నారు. కళాశాలలోకి మీడియాను అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తాజా పరిణామాలపై గీతం యూనివర్శిటీ యాజమాన్యం స్పందించింది. ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా వారు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై భీమిలి ఆర్ డీ ఓ భాస్కరరెడ్డి మాట్లాడుతూ కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామనీ, ఈ రోజు స్థలాన్ని స్వాధీనం చేసుకుని 5.25 ఎకరాల్లో కంచె వేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూమిలో పది చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంచె పనులు త్వరగా పూర్తి చేయాలనే తెల్లవారుజాము నుండి పనులు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.