West Bengal: పశ్చిమబెంగాల్లో రివర్స్ రాజకీయాలు మొదలయ్యాయి.తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీని వీడిపోయిన వారు ఒక్కొక్కరుగా బాక్ టు దీది అంటున్నారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా బిజెపిలో చేరిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పశ్చిమబెంగాల్ శాసనసభ మాజీ ఉపసభాపతి సోనాలీ గుహ మారుమనసు పొందారు.మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లోకి వస్తానంటూ ఆమె ఆ పార్టీ అధినేత్రి,ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వేడుకున్నారు.ఈ మేరకు ఆమె తన ట్విట్టర్లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ సోనాలీ గుహ ఎవరంటే?
వరుసగా నాలుగు సార్లు తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్ పై అసెంబ్లీకి ఎన్నికైన ఘనత సోనాలీ గుహ ది. తృణమూల్ కాంగ్రెస్లో ఆమె సీనియర్ మోస్ట్ నాయకురాలు.మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు. సుదీర్ఘకాలం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు అనారోగ్య కారణాలతో 2001 ఎన్నికల్లో ఖాళీ చేసిన సతగాచియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థి గా ఆమె తొలిసారి అఖండ విజయం సాధించారు.ఆ విజయపరంపర తదుపరి కూడా మూడుసార్లు కొనసాగింది.మొత్తం ఇరవై సంవత్సరాల పాటు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.2006 లో రెండోసారి గెలిచిన తదుపరి ఆమెను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ తొలి మహిళ ఉపసభాపతిగా ఎన్నికయ్యారు.అయితే మొన్నటి ఎన్నికల్లో ఆమెకు మమతా బెనర్జీ టిక్కెట్ ఇవ్వలేదు.దీంతో ఆమె మనస్తాపానికి గురై అప్పటికప్పుడు ఆవేశపూరిత నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరిపోయారు.కానీ ఆమెకు బీజేపీ కూడా టిక్కెట్ ఇవ్వలేదు.టీఎంసీ నుండి బిజెపిలోకి వచ్చిన ముప్పై మందికి టిక్కెట్ ఇచ్చిన కమలనాథులు సోనాలీ గుహ ను పక్కన పెట్టారు.అప్పటి నుంచి ఆమె అసంతృప్తితో ఉంది.
West Bengal: తాజా పరిణామం ఏంటంటే!
శనివారం నాడు ఆమె తన ట్విట్టర్లో ఎమోషనల్ అయ్యారు.నీరు లేని చోట చేప ఎలా ఉండలేదో దీదీ లేనిచోట నేను కూడా ఉండలేను అంటూ భావోద్వేగానికి గురయ్యారు.”ఈ లెటర్ ను ముక్కలైన హృదయంతో రాస్తున్నా. వేరే పార్టీలో జాయిన్ అయి తప్పుడు నిర్ణయమే తీసుకున్నా. అక్కడ ఉండలేకపోతున్నా”అని పేర్కొన్నారు.’నన్ను క్షమించండి.. తిరిగి పార్టీలోకి తీసుకోండి ..ఇక మీతోటే జీవితాంతం ఉంటానంటూ” మమతా బెనర్జీని సోనాలీ గుహ వేడుకుంది.అయితే రాజకీయంగా చాలా కఠినంగా వ్యవహరించే దీదీ తన మాజీ సహచరి సోనాలి గుహను కరుణిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.