జగన్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య ఇప్పట్లో తగువులు తీరేలా లేవు. ఎడ్డెం అంటే తెడ్డెం తెడ్డేమ్ అంటే ఎడ్డీం అనే లాగే ఉంది పరిస్థితి… తాజాగా ప్రభుత్వ భూముల అమ్మకం విషయంలో హైకోర్టులో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఓ జడ్జి గారి మీద డౌట్ వచ్చింది. ఆయన ఉంటే కచ్చితంగా తమకు ప్రతికూల తీర్పు, పరిస్థితి వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జడ్జి గారిని సదరు విచారణ నుంచి తప్పుకోవాలని ప్రమాణపత్రం (ఆఫడవిట్) దాఖలు చేసింది. దీంతో మరోసారి న్యాయ వ్యవస్థ పై జగన్ ప్రభుత్వం తీరు చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా తొమ్మిది ప్రాంతాల్లో విలువైన భూములను అమ్మాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తామని ప్రకటించింది. ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఎలా అమ్ముతారని, ప్రభుత్వ భూమి అంటే ప్రజాధనం అని దాన్ని అనే హక్కు దాని ద్వారా వచ్చే డబ్బుతో ఖర్చు చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదంటూ సుమారు పది మంది వరకూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ కేసు విచారణ జస్టిస్ రాకేష్ కుమార్, కృష్ణమోహన్ ల బెంచ్ కు వెళ్ళింది.
** ఇప్పటికే ఈ కేసు విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు మొదటి విచారణను పూర్తి చేశారు. దీనిలో పిటిషనర్ల తరఫున వాదానాలు విన్న న్యాయమూర్తులు ప్రభుత్వ భూములు ప్రతిసారి ఎలా అమ్ముకుంటారని, అంత గత్యంతరం ఎందుకు వచ్చిందని వ్యాఖ్యానించారు.
** కేసు విచారణలో కీలకంగా ఉన్న రాకేష్ కుమార్ మీద ప్రభుత్వం అవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ కేసు విచారణలో ఆయన ఉంటే, ఖచ్చితంగా అది తమకు ప్రతికూలంగా మారుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఆయనను కేసు నుంచి తప్పించాలని భావిస్తోంది.
సాధ్యమేనా??
ఓ కేసు విచారణ హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు ఆ జడ్జి సదరు విచారణలో పాల్గొనకుండా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానిని అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించిన సదరు న్యాయమూర్తిని తమ కేసు విచారణ నుంచి తప్పించాలని సుప్రీం కోర్టును కోరవచ్చు. సదరు న్యాయమూర్తి ఆ కేసు విచారణ చేస్తే, తమ కేసు ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది అని భావిస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి ని ఆ కేసు విచారణ నుంచి తప్పించవచ్చు. దానికి గల కారణాలను అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతివాది కచ్చితంగా తన అభ్యంతరాలను ప్రమాణపత్రం (ఆఫడవిట్) రూపంలో వ్యక్తం చేయాలి. దీనిని పరిశీలించే అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని ఆ కేసు విచారణ నుంచి తప్పిస్తుంది.
** ఆస్తుల వేలం కేసుల్లో జస్టిస్ రాకేశ్కుమార్ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫున అఫడవిట్ దాఖలు లో ఆరోపించారు.
** మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరఫున మిషన్ ఆఫ్ ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్కుమార్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద చేపట్టిన ఆస్తుల వేలం కేసుల్లో జస్టిస్ రాకేశ్కుమార్ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు. ఇలాంటి సహేతుకమైన ఆందోళన ఉన్నప్పుడు విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా అభ్యర్థించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.
మిషన్ బిల్డ్ ఏపీ పథకం ద్వారా విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించే యత్నాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిలో విచారణ నుంచి జస్టిస్ రాకేశ్కుమార్ తప్పుకోవాలని ప్రవీణ్కుమార్ తాజాగా అఫిడవిట్ వేశారు.
జస్టిస్ రాకేశ్కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన కథనాలను అఫిడవిట్తో జతచేశారు. వ్యాజ్యం విచారణకు ముందే ఓ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలే ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని చేసిన వ్యాఖ్యలు అవసరం లేనివన్నారు. కేసులో రాకేష్ కుమార్ అతిగా స్పందించారని, అవసరం లేని పదప్రయోగాలు చేసినట్లు పత్రికల్లో వచ్చినట్లు వాటిని సమర్పించారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొచ్చుకొస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందన్నారు. ప్రభుత్వ భూముల వేలం వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో ఈనెల 17న విచారణ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో ఎవర్ని నియమిస్తుందో, ఏ బెంచ్ కి కేసు వెళ్తుందో అని న్యాయ నిపుణులు ఆసక్తి గా వేచి చూస్తున్నారు.
** అయితే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే జగన్ ప్రభుత్వం మరికొన్ని కేసుల్లోనూ ఇదే తరహా మార్పులు కోరే అవకాశం ఉంది. పలు కేసుల్లో న్యాయమూర్తులు అన్నట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలను దీనికి జోడించి, ప్రభుత్వం పరువు పోతుంది అనే కోణంలో, న్యాయమూర్తుల మాటలను వక్రీకరించడం లేదా న్యాయమూర్తులు అన్న మాటల్ని రాయడం వల్ల రాజ్యాంగంలోని పరిపాలనా వ్యవస్థ లోకి న్యాయవ్యవస్థ చర్చకు వస్తుందని కోణాన్ని చూపి మరికొన్ని కేసుల్లో సైతం బెంచ్ లను మార్పు చేసే అవకాశం ఉంది.