RGV : సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరినీ ఓ ఆట ఆడేసుకుంటోంది కరోనా వైరస్. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడారు. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ అని తేలింది.
పవన్ ప్రస్తుతం తన ఫామ్హౌజ్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా సంచలన డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ వేదికగా కొన్ని పోస్టులు చేశారు. దీంతో పవన్ అభిమానులు వర్మపై మాటల దాడికి దిగారు.
RGV : ఆర్జీవీ స్టైల్ ట్వీట్లు ఇవీ!
అయితే పోస్ట్ చేస్తే మాటల దాడికి దిగడం ఏంటనీ ఆలోచిస్తున్నారు కదూ.. అందరిలా కామెంట్ చేస్తే తాను వర్మ ఎందుకు అవుతాడు చెప్పండి. ఈసారి కూడా వర్మ.. పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేస్తూ కొన్ని వరుస ట్వీట్లు చేశారు. దీంతో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఆర్జీవీ అన్నట్లు మారింది. ఇంతకీ వర్మ చేసిన పోస్ట్ ఏంటనేగా… పవన్ కళ్యాణ్ బెడ్పై రెస్ట్ తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్ చేసిన వర్మ.. ‘పవన్ కళ్యాణ్ అభిమానులు.. వెంటనే ఆ వైరస్ లను పచ్చడి పచ్చడి చేసి చంపేయండి’. అంటూ ట్వీట్ చేశాడు.
ఇక మరో పోస్టులో.. ఇంకో అడుగు ముందుకేసి..‘పవన్ ఇలా మంచాన పడడానికి కోవిడ్ కారణం కాదని..వేరే హీరోల అభిమానులే’ అంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా వసూలు సాబ్ కలెక్షన్లు అంటున్నారు.ర౦డి…కదలండి …ప్రాణాలకు తెగించి పీకే జేబులు నింపండి అంటూ పవన్ ఫ్యాన్సుకు పిలుపిచ్చారు . ఇక మరో పోస్టులో ఆ ఫొటోలో ఏదో తప్పు కనిపిస్తోందని దానిని వెతికి పట్టినవారికి రివార్డు ఇస్తానంటూ’ కామెంట్ చేశారు. దీంతో పవన్ అభిమానులు వర్మపై మండిపడుతున్నారు. ఓ వైపు తమ అభిమాన స్టార్ కరోనా బారిన పడితే వర్మ ఇలా రెచ్చగొట్టడం ఎంత వరకు సబబా అంటూ అడుగుతున్నారు. మరి వర్మ ఈ పోస్టులను ఇలాగే ఉంచుతాడా.?ఎప్పటిలాగే డిలీట్ చేసి మళ్లీ దానికి ఓ కారణం చెబుతాడా.. చూడాలి.