అమరావతి: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని టైటిల్ ప్రకటించడంతోనే వివాదం రాజుకుంది. ఆ టైటిల్ను వర్మ విరమించుకోవాలంటూ రాయలసీమ రెడ్డి యూత్ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద టైటిళ్లతో సినిమాలను తీసిన వర్మ తాజాగా నిన్న విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టిఆర్’ చిత్రం గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన తదుపరి చిత్రం టైటిల్ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని తెలియజేశారు.
ఈ నేపథ్యంలో రాయలసీమ రెడ్డి యూత్ ఆ టైటిల్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
రెడ్డి పట్టుదలకు ప్రతీకగా వర్మ సినిమా తీయాలని మంచి ఆశయంతో ఉన్నప్పటికీ మరో వైపు కించపరిచేలా ఉన్నందున మరో పరు పెట్టాలని కోరింది.
వాస్తవానికి ఈ ప్రజాస్వామ్యంలో ఏ కులానికీ రాజ్యాలు లేవనీ అలాంటిది కమ్మ రాజ్యం ఎక్కడిదని వారు ప్రశ్నించారు. ఈ టైటిల్ పరిశీలిస్తే కమ్మ రాజ్యాన్ని రెడ్లు ఆక్రమించుకున్నట్లుగా అర్థం వస్తోందని అన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా పాలన చేసి ప్రజలకు సుపరిపాలన అందించి ఓటర్ల మనసులో స్థానం సంపాదించుకున్న వారే అధికారంలోకి వస్తారని వర్మ గ్రహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ప్రజలు జగన్మోహనరెడ్డిని దీవించి అధికారం అప్పగించారని అన్నారు. ఈ టైటిల్ని విరమించుకొని మరొక పేరుతో సినిమా తప్పక తీయాలని రెడ్డి యూత్ కోరింది.
సినిమా తీయక ముందే టైటిల్తోనే వివాదాన్ని రాజేయడం వర్మకు తొలి నుండి అలవాటేనన్న అందరికీ తెలిసిందే.