కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తొమ్మది మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండగ గోపవరం గ్రామానికి చెందిన సుమారు 25 మంది ట్రాక్టర్లో వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.