వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రాజకీయంగా చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అనుకున్నవారిలో రోజా ఒకరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబును, లోకేశ్ ను ఓ ఆట ఆడుకున్నారు. వైసీపీలో అన్ని వర్గాలకు బాగా దగ్గరయ్యారు. సినీ గ్లామర్, రాజకీయ పరిపక్వత ఆమెను రాష్ట్రస్థాయి నాయకురాలిగా మార్చేశాయి. పార్టీలో ప్రముఖ స్థానం ఉన్న రోజా సొంత జిల్లాలో పార్టీ ప్రముఖులతో పొసగకపోవడం ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
రోజా బద్ద విరోధికి కార్పొరేషన్ పదవి..
రోజా వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా తనకు తిరుగులేదనే అనుకున్నారు. మంత్రి పదవి వస్తే జిల్లాలో తిరుగులేని నాయకురాలిగా ఎదగాలని, టీడీపీని ఓ ఆట ఆడుకుందామనుకున్న రోజాకు నగరిలోనూ జిల్లాలోనూ శత్రువులు అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రోజాకు బద్ద శత్రువు కేజే కుమార్ భార్య కె.శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఆ మంత్రి స్కెచ్ ఉందని అంటున్నారు. కేజే కుమార్ కు రోజాకు గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చాక వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. కుమార్ ఇంట్లోని శుభకార్యానికి పార్టీ నాయకులు వెళ్లొద్దంటూ ఓ వీడియోనే విడుదల చేసే స్థాయికి విబేధాలు పెరిగాయి. ఇప్పుడు ఆయన భార్యకే కార్పొరేషన్ పదవి దక్కడం రోజాకు చెక్ పడినట్టేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
రోజా అడుగులు ఎటువైపు..
తన ప్రత్యర్ధులను పార్టీలో అందలం ఎక్కించడం, జిల్లాలో తన హవా నడవకుండా ఆ సీనియర్ మంత్రి చక్రం తిప్పడంతో రోజా పార్టీలో ఇమడలేకపోతున్నారు. అయితే.. పార్టీపై ముఖ్యంగా జగన్ పై ఉన్న అభిమానంతో రోజా పార్టీకి దూరమయ్యే అవకాశం లేదు. దీంతో ఆమె పూర్తిగా సైలంట్ అయ్యారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ విబేధాలు తగ్గిపోతాయనే భావిస్తున్నారట. అలా కాని పక్షంలో ఏదొక నిర్ణయం తీసుకుని ఆ మంత్రికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆలోచిస్తున్నారట. కొసమెరుపు ఏంటంటే.. ఈ సీనియర్ మంత్రి అంటే జగన్ కు బాగా గురి. దీంతో రోజా మాటలు జగన్ వరకూ వెళ్లడం లేదని తెలుస్తోంది.