RRR: తన కేసు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కిందకు రాదని, తాను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.అందువల్ల తనను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించవద్దంటూ ఆయన స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం లేఖ రాశారు.ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పీకర్ కు ఒక లేఖ రాస్తూ తక్షణం రఘురామ కృష్ణంరాజును ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరడం తెలిసిందే.దీనిపై స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ తాజాగా స్పీకర్ కు లేఖ రాశారు.విజయసాయి రెడ్డి పిటిషన్ లో పసలేదని ,తనను అనర్హుడిగా ప్రకటించడానికి కారణాలు లేవని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.అందువల్ల ఆయన లేఖను పక్కనపెట్టాల్సిందిగా స్పీకర్ ని రఘురామకృష్ణంరాజు కోరారు.
ఆర్ ఆర్ ఆర్ వాదన ఏమిటంటే?
విజయసాయి రెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు తానెన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నది రఘురామకృష్ణంరాజు వాదన.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రిని పాలనలో జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవలసిందిగా మాత్రమే తాను కోరుతూ వస్తున్నానని,అవే సలహాలు ఇస్తున్నానని ఆయన స్పీకర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ చర్య పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని ఆయన చెప్పారు.ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమం కాదని కూడా ఆయన వాదించారు.తానెప్పుడు లోకసభ లో పార్టీ విప్ ను ధిక్కరించలేదని ఆయన స్పీకర్ కు తెలిపారు.పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు తన చర్యలు రావని చెబుతూ,ఆయన గతంలో ఇందుకు సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పుల ప్రతులను కూడా తన లేఖకు జతపరిచారు.ఆ తీర్పులను పరిశీలిస్తే తనకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని ఎవరికైనా అర్థమైపోతుందని రఘురామకృష్ణం రాజు స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఘాటుపదజాలంతో స్పీకర్ కి విజయసాయి లేఖ!
ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి ఘాటు పదజాలంతో లోక్ సభ స్పీకర్ కు ఒక లేఖ రాశారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును అనర్హుడిగా ప్రకటించే విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతుండడం పట్ల ఆయన ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.పదకొండునెలల క్రితమే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేఖ ఇస్తే ఇంతవరకు దానిపై స్పీకర్ చర్య తీసుకోకపోవడాన్ని విజయసాయి రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.ఇందుకు ఆ లేఖలో దొర్లిన ఒక చిన్న సాంకేతిక తప్పుని స్పీకర్ కార్యాలయం కారణంగా చూపడాన్ని ఆయన ఖండించారు.నర్సాపురం లోకసభ నియోజకవర్గం ప్రజలు రఘురామకృష్ణంరాజు తమ ఎంపీగా కొనసాగడాన్ని ఇష్టపడ్డం లేదని, వెంటనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.ఇరువర్గాల వాద, ప్రతివాదనలు విన్న స్పీకర్ ఏం చేస్తారో వేచి చూద్దాం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?