దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చరణ్ వీడియో టీజర్ రిలీజై సినిమా మీద ఊహకందని అంచనాలు పెంచేసింది. దాంతో తారక్ వీడియో టీజర్ రిలీజ్ చేయమని నందమూరి అభిమానుల ఒత్తిడి చేస్తున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ముందు తారక్, ఓలియా మోరిస్ మీదే కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నాడటా రాజమౌళి.
సమ్మర్ టార్గెట్ గా ఆర్ ఆర్ ఆర్ ని కంప్లీట్ చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు 2020 జూలై 30 న రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. అందుకు నిర్మాత దానయ్య తో పాటు దర్శకుడు రాజమౌళి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా రిలీజ్ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో భారీ పాన్ ఇండియన్ సినిమాని ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. అలాగే తారక్, చరణ్ లు ఇద్దరు కూడా ఈ సినిమాని ఎటువంటి పరిస్థితుల్లో మార్చ్ వరకు పూర్తి చేసి నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్స్ లో బిజీ కావాలని ప్లాన్ చేసుకున్నారు.