ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేపై ఆ రాష్ట్ర పోలీసులు రూ.2.50 లక్షల రివార్డు ప్రకటించారు. అతన్ని పట్టిస్తే ఆ మొత్తాన్ని అందజేస్తామని యూపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. కాన్పూర్ సమీపంలోని ఓ గ్రామంలో 8 మంది పోలీసులపై కాల్పులు జరిపి వారిని హతమార్చిన ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన అనంతరం అతను యూపీని వదిలి పారిపోయాడు. ఈ క్రమంలోనే అతనిపై రివార్డును పోలీసులు పెంచారు.
ఆ కాల్పుల ఘటనలో వికాస్ దూబే, అతని అనుచరులు.. ఒక డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులను హతమార్చారు. ఆ తరువాత దూబే అక్కడి నుంచి మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్కు వెళ్లి ఉంటాడని తెలుస్తోంది. గతంలో దూబేపై రూ.50వేల రివార్డు ఉండేది. దాన్నిప్పుడు రూ.2.50 లక్షలకు పెంచారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతని కోసం పోలీసులు అన్ని చోట్లా గాలిస్తున్నారు. దూబేపై ఇప్పటికే 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతన్ని పలు సార్లు అరెస్టు కూడా చేశారు. అయినా అతను బయటకు వచ్చి గ్యాంగ్స్టర్గానే కొనసాగుతున్నాడు.
దూబేకు ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతను కాన్పూర్ కాల్పుల ఘటన అనంతరం తప్పించుకున్నాడు. అయితే దూబేపై జరగనున్న దాడి గురించి కొందరు పోలీసులు ముందుగానే దూబేకు ఫోన్లో చెప్పారు. దీంతో ఆ పోలీసు అధికారులను గుర్తించి సస్పెండ్ చేస్తున్నారు. ఇక వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.