అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్ సర్వీసుల పునః ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. ప్రజా రవాణా ప్రారంభానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో గురువారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణాల మధ్య ఒక బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకే బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చించారు. బస్టాండ్ లో మాత్రమే బస్సులు ఆపుతారు. బస్టాండ్లో ప్రయాణికులకు టికెట్ కోనుగోలు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ప్రయాణికుల వివరాలు, ఫోన్ నంబర్లు, ఎక్కడకు వెళ్ళేది వివరాల నమోదు చేసుకుంటారు.
కరోనా వైరస్ నేపథ్యంలో బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నారు. సగం సీట్లతో బస్సు లను నడిపితే సంస్థకు భారీగా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. దీనితో వివిధ రకాల రాయితీ పాసులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలకు దశలవారీగా సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆర్టీసీ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.