(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను అనంతపురం ఆర్టిఏ అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. తమ బస్సులు అక్రమంగా సీజ్ చేశారంటూ ట్రావెల్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ నిర్వహించిన ధర్మాసనం సీజ్ చేసిన ట్రావెల్స్ బస్సులను రిలీజ్ చేయాలని వారం రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు మేరకు మూడు రోజుల క్రితమే సీజ్ చేసిన బస్సులను అధికారులు రిలీజ్ చేశారు. గతంలో సీజ్ చేసి రిలీజ్ చేసిన బస్సులనే తాజాగా మరో సారి ఆర్టిఎ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయంలో అధికారుల తీరు పట్ల దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఇటీవల జెసి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అధికారుల తలనొప్పులు భరించలేక కొద్ది రోజులు ట్రావెల్స్ వ్యాపారం ఆపివేయాలని కూడా భావిస్తున్నట్లు జెసి చెప్పారు.