Andhra Pradesh: కడప జిల్లాకు చెందిన ఆ అధికార పార్టీ ఎమ్మెల్సీకి రాత్రయితే నిద్రపట్టని పరిస్థితి నెలకొంది.తన సొంత జిల్లాకు చెందిన ఈ నేతను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయించారు.ప్రమాణ స్వీకారం చేసి పది రోజులైనా కాకముందే ఆ నేతకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.దీంతో భీతిల్లిన సదరు ఎమ్మెల్సీ పోలీసులను ఆశ్రయించారు.వివరాల్లోకి వెళితే..
బి.సి ఎమ్మెల్సీని బెదరగొట్టేశారు!
ప్రొద్దుటూరుకు చెందిన రమేశ్ యాదవ్ ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు.మొదటిసారిగా కడప జిల్లాలో ఒక బీసీని ఎమ్మెల్సీ చేశామంటూ వైసిపి గొప్పలు చెప్పుకుంది. అయితే రమేశ్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి వచ్చిన ఆనందం పదిరోజుల్లోనే ఆవిరైంది.ఆయన గత నెల ఇరవై వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.ఆ నాలుగు రోజులకే అర్ధరాత్రిపూట ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ మొదలయ్యాయి.ఇరవై అయిదు, ఇరవై ఆరు తేదీల్లో రాత్రి పూట మూడు ఇంటర్నెట్ నెంబర్ల నుండి ఫోన్లు వచ్చాయి.”ఎమ్మెల్సీ పదవి వచ్చిందని సంబరపడకు.. నువ్వు మా నాయకుడు తో సమానం అనుకుంటున్నావా? నీకు ప్రాణాలపై ఆశవుంటే ఊరు వదిలి వెళ్లిపో.లేకుంటే ఇటీవల ప్రొద్దుటూరులోనే హత్యకు గురైన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య సమాధి పక్కనే నిన్నూ సమాధి చేస్తాం” అని ఫోన్ చేసిన వారు ఆయనను బెదిరించారు.
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు!
వరుసగా రెండు రోజులు ఈ తరహా బెదిరింపులు రావడంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రొద్దుటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నెంబర్లను కూడా పోలీసులకు తెలియజేశారు.ఎమ్మెల్సీ ఫిర్యాదుమేరకు ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇది జరిగిన మాట నిజమేనని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ధ్రువీకరించారు.ఎమ్మెల్సీ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ఇంటర్నెట్ నెంబర్లు కావడంతో సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాశామని,ఆ వివరాలు అందగానే ఆయన్ను బెదిరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
“మా నాయకుడు “అంటే ఎవరు?
నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన రమేశ్ యాదవ్ ను ఎందుకు.. ఎవరు బెదిరిస్తున్నారన్నది తేలాల్సి ఉంది.మా నాయకుడు తో సమానం అనుకుంటున్నావా అని ఎమ్మెల్సీకి ఫోన్ చేసిన వారు ప్రస్తావించడాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ నాయకుడు ఎవరో కూడా కనిపెట్టాల్సి ఉంది.ప్రొద్దుటూరులోనే వైసిపిలోని మరో ముఖ్యనేత ఈ విధమైన బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏదేమైనా ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీకి,అదీ ముఖ్యమంత్రి ఆశీస్సులున్న నేతకు ఈ స్థాయిలో బెదిరింపులు రావడం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే.