ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వపరంగా కసరత్తు జరుగుతుండగానే మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఏర్పడనున్నాయి అంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంతకుముందే రాష్ర్టంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని ప్రకటించారు.ఇందుకోసం సంబంధిత కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో ఇరవై అయిదు జిల్లాలు ఏర్పడతాయని అందరూ భావించారు.అయితే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అరకులో ప్రత్యేక పరిస్థితులున్నందున ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడతాయని ప్రకటించారు.ఇప్పుడా సంఖ్య ఏకంగా ముప్పై రెండు కు పెరిగింది.ఈ జాబితాను ఎవ్వరు సోషల్ మీడియాలో విడుదల చేశారు?దీనికున్న అధీకృతమేమిటన్నది వెల్లడి కావడం లేదు.ఒకవేళ ఫేక్ జాబితా అయితే ఈపాటికి అధికారవర్గాలు స్పందించి ఉండేవంటారు.ఒకవేళ ప్రభుత్వమే ప్రజా నాడిని తెలుసుకునేందుకు దీన్ని లీక్ చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆ లిస్ట్ ప్రకారం ఏర్పాటు కాబోతున్న కొత్త జిల్లాలు ఇవే.. పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం,విజయవాడ, అమరావతి, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట.అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు కాని ఏడు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయని అర్థం.పలాస,పార్వతీపురం,అమరావతి,మార్కాపురం,గూడూరు,మదనపల్లె,ఆదోని జిల్లా కేంద్రాలు కాబోతున్నాయని ఆ జాబితా సారాంశం.అయితే కొత్తగా ఏర్పాటు చేస్తారని చెబుతోన్న ఈ ముప్పై రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇవి ప్రజలకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఉదాహరణకు ప్రకాశం జిల్లాను తీసుకుంటే బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి చీరాల పర్చూరు సంతనూతలపాడు నియోజక వర్గాలు ఉన్నాయి. పర్చూరు ,చీరాల మినహాయిస్తే మిగిలిన రెండు నియోజకవర్గాలు బాపట్ల జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటాయి.కానీ తాజాగా బాపట్ల జిల్లాలో పర్చూరు చీరాల ను మాత్రమే కలుపుతున్నట్లు జాబితా వెల్లడించింది.అద్దంకి సంతనూతలపాడు నియోజక వర్గాలను ఒంగోలు జిల్లా లో ఉంచేస్తారు.ఇది మంచి ప్రతిపాదనే.అలాగే ఒంగోలుకు చాలా దూరంగా ఉండే పశ్చిమ ప్రాంతాన్ని కవర్ చేస్తూ పొదిలి కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం కూడా ప్రజలకు బాగా నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.అలాగే ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఆ చుట్టుపక్కల ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలను చేరుస్తుారంటున్నారు.మొత్తంగా చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ బాగానే ఉన్నప్పటికీ ఇది ఎంతవరకు నిజం అన్నదే తేలాల్సిన విషయం.