Russia Ukraine War: ఉక్రెయిన్ పై గత మూడు రోజుల నుండి రష్యా యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సైనికులు కూడా చివరి వరకూ పోరాడుతున్నారు. రాజధాని కీవ్ నగరంలోకి కూడా రష్యా సైనికులు ప్రవేశించి ఆక్రమించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వివిధ దేశాధ్యక్షులకు ఫోన్ చేసి సాయం అర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీకీ ఫోన్ చేసి తమకు అండగా నిలబడాలని, సాయం చేయాలని కోరారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను జెలెన్ స్కీ ప్రధాని మోడీకి వివరించారు. తమ దేశంపై రష్యా దాడులు ఆపేలా చూడాలని జెలెన్ స్కీ మోడీని కోరారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో జరిగిన ప్రాణ, ఆస్తినష్టం పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారఁ వ్యక్తం చేశారు.
Russia Ukraine War: హింసకు స్వస్తి పలకాలన్నది తమ వైఖరి
హింసకు స్వస్తి పలకాలన్నది తమ వైఖరి అని మోడీ పునరుద్ఘాటించారు. చర్చలే సమస్య పరిష్కారానికి మార్గమన్న తమ ఫంధాను మరో సారి స్పష్టం చేశారు మోడీ. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఏ రూపంలో అయినా సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి తెలిపారు. అదే సమయంలో ఉక్రెయిన్ లోని భారత పౌరుల భద్రత పట్ల మోడీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తరలించేందుకు ఉక్రెయిన్ అధికారులు తక్షణమే ఏర్పాట్లు చేయాలని కోరారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బారత్ తటస్థ వైఖరితో ఉన్న సంగతి తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇప్పటికే ఒక సారి
ఇంతకు ముందే భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పాలిఖా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోడీ మాట్లాడితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. యుద్ధం విరమించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితులను వివరించారు. ఇదే సందర్భంలో ఉక్రెయిన్ లో ఉన్న భారత పౌరులు, విద్యార్ధుల రక్షణపై మోడీ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడే అవకాశం ఉంది. వార్ నేపథ్యంలో ఉక్రెయిన్ లో భారత పౌరులు, విద్యార్ధులను సురక్షితంగా తరలించే ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేపట్టింది. నేడు తొలి ప్రత్యేక విమానంలో 217 మంది విద్యార్ధులు ముంబాయికి చేరారు. మరో ప్రత్యేక విమానం ఈ రాత్రికి ఢిల్లీ చేరనుంది.