Russia – Ukrine War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన వందలాది మంది వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్ధులను దేశానికి తీసుకువచ్చేందుకు నేటి నుండి ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో సమీప దేశాల నుండి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఉన్నత స్థాయి అధికారులతో నిన్న సమీక్ష జరిపారు. ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.
Russia – Ukrine War: బూకారెస్ట్ విమానాశ్రయం నుండి
ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిలో రాష్ట్రానికి చెందిన 13 మంది విద్యార్ధులు నేడు ప్రత్యేక విమానంలో వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు, ఏపి డైరీ డెవలప్ మెంట్ ఎండీ డాక్టర్ ఏ బాబు తెలిపారు. బూకారెస్ట్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న ప్రత్యేక విమానం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని విదేశాంగ శాఖ అధికారులు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక విమానంలో వస్తున్న వారిలో రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు బసంత్ కార్తీక, గోప కుమార్ నాయర్ వర్ష, గంగరాజు నాగశ్రీకరి, తూతుకూరి హర్షిత, ఖాన్ టాన్జీల, రాజులపాటి అనూష, పద్మజం రేష్మ, మీనా అవంతిక, ప్రతాప్ తరాని, పెరువన్ కుజిల్, తాన్సిహ సుల్తానా, నీలా హర్ష వర్థన్, దేవ వేదాంత్ మనోజ్ కుమార్, కల్డనే సాక్విజ్ జకీర్ హుస్సేన్ లు ఉన్నారని డాక్టర్ ఎ బాబు తెలిపారు,.