కరోనా ప్రభావం ప్రముఖ దేవాలయాల పైన కూడా పడింది.ఫలితంగా సదరు దేవాలయాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఈ కారణంగా దేవాలయాల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి అంతటి ఆదాయం వుండేది.కరోనా దెబ్బకు షిర్డీ ఆలయానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది.
మామూలు రోజుల్లో సంవత్సరానికి షిర్డీ ఆలయానికి నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. అంటే రోజుకు కోటి రూపాయల పైగానే ఆదాయం వచ్చేది అన్నమాట.మూడు నెలలుగా లాక్ డౌన్ తో ఆలయం మూతపడడం.. భక్తుల రాకపోకలు లేకపోవడంతో ఆలయానికి ఆదాయం లేకుండా పోయింది. విరాళాలు కూడా రాకపోవడంతో షిర్డీ ఆలయ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది!ఎంతగా దిగజారిందంటే జూన్ నెలలో ఇప్పటి వరకు ఆలయ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించ లేనంత!సాధారణంగా ప్రతి నెలా ఐదవ తారీకునే ఆలయ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తారు.
కానీ ఈ నెల్లో ఇరవై వ తేదీ దాటినా వారికి షిర్డీ సంస్థాన్ ట్రస్టు జీతాలు చెల్లించలేదు.షిర్డీ ఆలయ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ తలెత్తలేదని సంస్థాన్ ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి.ఆలయానికి వచ్చే విరాళాలను ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. లాక్ డౌన్ తో ఆదాయం లేక డిపాజిట్ల నుంచి తీయలేక.. బయట నుంచి రాక ఖాతాల్లో ఉన్న కనీస మొత్తాలు మే నెల వరకే జీతాలకు ఖర్చు అయ్యిపోయాయి. దీంతో జూన్ లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆ వర్గాలు వివరించాయి.ఈ పరిస్థితుల్లో భారమంతా షిరిడి నాథుని మీదనే వేసి ఆలయ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు.