Sajjala Rama Krishna Reddy: ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై రాజీనామాలకు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్ కు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రతి అంశంలో వైసీపీ సభ్యుల రాజీనామాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని సజ్జల అన్నారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి వాటిని ఆమోదింపజేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన సజ్జల..తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేతగా జగన్ కూడా ఆందోళన చేశారనీ, కలసి రావాల్సిందిగా టీడీపీని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని అన్నారు. వైసీపీకి సవాల్ విసిరే బదలు చంద్రబాబు తన ఎంపిలతో రాజీనామా చేయించాలని పేర్కొన్నారు.
Sajjala Rama Krishna Reddy: అమరావతి ఓ భూకుంభకోణం
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని కోర్టులు ఏ కోణంలో చూశాయో తనకు తెలియదని పేర్కొన్న సజ్జల అమరావతి అనేది ఓ భూ కుంభకోణమని ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సజ్జల పునరుద్ఘాటించారు. అమరావతి భూ కుంభకోణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం సాంకేతికంగా అభ్యంతరం అయితే మరో కోణంలో వాస్తవాలు వెలుగుచూస్తాయని సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లు మాత్రం తప్పించుకోలేరని స్పష్టం చేశారు సజ్జల.
చంద్రబాబు, రఘురామ రాజు ఇద్దరూ సమన్వయంతో ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. రఘురామ వెనుక చంద్రబాబు ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమన్నారు. వారి ఇద్దరి మధ్య పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయన్న సజ్జల..అధారాలతో రఘురామ దొరికిపోయారని అన్నారు. రఘురామ కేసులో సీఐడీ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని సజ్జల పేర్కొన్నారు.