Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పెద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసిపి చాలావరకు ఏకగ్రీవాలు చేయటానికి పావులు కదుపుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ పార్టీలో కీలక నేత గా రాణిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి మేకపాటి కార్యాలయంలో భేటీ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి..జిల్లా నాయకులతో మంతనాలు జరిపారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా వ్యవహరించాలని వీలైనంతవరకు ఏకగ్రీవాలు అయ్యేలా చూడాలని సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు నేతలకు సూచించారు. అంతేకాకుండా ఎవరు రెచ్చగొట్టినా జిల్లా నాయకులంతా సంయమనం పాటించాలని, ఓటర్ల అందరినీ చైతన్య పరచాలని సజ్జల చెప్పారు. వీలైనంత వరకు జిల్లా నాయకులు గ్రామ స్థాయి నాయకులతో చర్చలు జరిపి వాళ్లంతట వాళ్లే నాయకులను ఎన్నుకునే రీతిలో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రెండు సంవత్సరాలలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి ప్రతిపక్షంలో ఉన్న టిడిపి భయపడుతుంది అంటూ పేర్కొన్నారు. మొత్తంమీద నెల్లూరు నేతలతో పంచాయతీ ఎన్నికలలో చాలావరకు ఏకగ్రీవం చేయాలి అన్న రీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారు.