ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సేవలందించే సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఈ సేవలు ఆగిపోనున్నాయని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.
‘గురువారం నుంచి సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలు నిలిపివేయడం జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాతే ఈ సేవల పునరుద్ధరణ జరుగుతుంది’ అని పాకిస్థాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ క్రమంలో పాక్ నుంచి అట్టారికి రావాల్సిన భారత ప్రయాణికులు లాహోర్ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయారు. కరాచీ నుంచి 16 మంది సంఝౌతా ఎక్స్ప్రెస్ ద్వారా ప్రయాణం ప్రారంభించారని.. కానీ, పాక్ నిర్ణయంతో లాహోర్లోనే నిలిచిపోవాల్సి వచ్చిందని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.
రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన భారత ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా వాఘా సరిహద్దుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. అయితే, సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా పాకిస్థాన్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని భారత రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సంఝాతా ఎక్స్ప్రెస్ వారంలో రెండుసార్లు ఇరుదేశాల మధ్య ప్రయాణం కొనసాగిస్తుంది.