జమ్మూ కశ్మీర్ పర్యటకులను ఎంతగా ఆకర్షిస్తుందో..ఉగ్రదాడులతో అంతే భయానకంగా ఉండే ప్రదేశం. మొన్నటికి మొన్న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు ఢీకొన్న ఘటనలో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనపై దేశంలోని ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టకూడని పోస్ట్ పెట్టారు. తన చెల్లెలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన అనమ్ మీర్జా రూపొందించిన దుస్తులను ధరించిన సానియా ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిపై జవాన్లకు బాసటగా నిలువాల్సిన సమయంలో నువ్వు బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నావంటూ నెటిజన్లు మండిపడ్డారు. వీర మరణం పొందిన సైనికులకు భారత ప్రజలందరు ముక్తకంఠంగా నివాళులర్పిస్తుంటే డిజైనర్ దుస్తుల గురించి పోస్ట్ చేస్తావా అంటూ సానియాపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
దీంతో నెటిజన్ల అత్యుత్సహంపై సానియా స్పందించింది. ఆగ్రహంతో ఓ ట్వీట్ పెట్టింది. ” మేము సెలబ్రిటీలం అనుకునే ప్రతి ఒక్కరు దేశం పట్ల మీ దేశభక్తిని చాటుకునేందుకు తప్పక సోషల్ మీడియా మాధ్యమాలు అయిన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ పెట్టి ఈ దాడిని ఖండించండి”. ఎందుకంటే.. “మనం సెలబ్రిటీలు అవ్వటం వల్ల కొందరు వ్యక్తులు ఎప్పుడు, ఎలా మనల్ని టార్గెట్ చేయాలా అని కాచుకు కూర్చుంటున్నారు. మన సహనాన్ని పరీక్షించి మన పట్ల ప్రజల్లో ద్వేహాన్ని నింపుతున్నారు” అని ఉద్వేగంతో ట్వీట్ చేసింది. అంతేకాకుండా ” ఈ ఘటనపై నేను నా నిరసనను భహిరంగంగా వ్యక్తం చేయాల్సిన అవసరంలేదు. ఇంటిపై కప్పి ఎక్కి బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. అలాగే సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి వ్యతిరేకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకమే. మేము మాత్రమే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలి. ఇలాంటివి ఘటనలు ఎందుకు ఖండించాలి. ఇది ప్రతి ఒక్కరి భాద్యత. సరైన బుద్ది, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అర్ధమవుతుంది. అర్థకాకపోతే అది వల్ల కర్మ” అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
” నేను దేశం కోసం ఆడుతున్నాను. చెమటోడుస్తున్నాను. ఈ విధంగా నేను దేశానికీ సేవ చేస్తున్నాను. నేనెప్పటికీ ఆ జవాన్లకు మరియు వారి కుటుంబసభ్యులకు మద్దతుగానే నిలుస్తాను. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు.ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. మళ్ళీ ఇలాంటి రోజు కల్లోకూడా ఉహించుకోకూడదు. ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేము. కానీ ఇప్పటికీ ద్వేషం కంటే నేను శాంతిని కోరుకుంటున్నా. ఏదైన ఉపయోకరమైన విషయం జరగడం కోసం ఆగ్రహిస్తే అది మంచిది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు.. ఉండదు కూడా. మీరు కూడా ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు ఎన్ని పోస్టులు చేశారు, ఏం పోస్ట్ చేశారో.. అని తీర్మానించడం మానేసి దేశానికి ఉపయోగేపడే పని చేయండి. దేశానికి మీ వొంతు సహాయం అందించండి. మేం చేస్తున్నాం.. కానీ సోషల్మీడియాలో ప్రకటిస్తూ కాదు” అంటూ తన అసహనాన్ని వెళ్లబుచ్చింది.
సానియా ఓ గొప్ప క్రీడాకారిణి. 2004 లో అర్జున అవార్డు, 2006 లో పద్మ శ్రీ, 2015 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మరియు 2016 లో పద్మ భూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం సానియాకి అందించింది. 2010 లో సానియా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్నది. అప్పట్లో ఈ వివాహంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో పోస్టులు పెట్టారు. మళ్ళీ చాలా కాలం తర్వాత పుల్వామా ఘటన నేపథ్యంలో సానియాని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు.