Sanju Rani Verma: ఓ యువతికి ఆమె తండ్రి చదువు మాన్పించి పెళ్లి చేయాలని భావించాడు. పెళ్లి ఇష్టం లేని ఆ యువతి ఇంట్లో నుండి పారిపోయింది. తన లక్ష్యాన్ని చేరుకున్న ఆమె ఏడేళ్ల తరువాత ఇంటికి తిరిగి వచ్చింది. ఏడేళ్ల తరువాత ఇంటికి తిరిగి వచ్చిన ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. సాధారణ యువతిగా ఇంటి నుండి పారిపోయిన ఆ యువతి తన పట్టుదల, కృషి ఫలితంగా ఒ ఉన్నతాధికారి పొజిషన్ లో ఇంటికి తిరిగి రావడం వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విషయంలోకి వెళితే..మీరట్ కు చెందిన 28 ఏళ్ల సంజు రాణి వర్మ తల్లి 2013లో కన్నుమూసింది. దాంతో ఆమె చదువులను నిలిపివేసిన తండ్రి సంజు రాణికి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే సంజు రాణి వర్మకు చదువు అంటే ప్రాణం. ఉన్నత చదువులు చదవాలనీ, పెద్ద ఉద్యోగం సాధించాలన్న పట్టుదల ఉన్నాయి. దీంతో పెళ్లికి అంగీకరించలేదు. ఇంట్లో ఉంటే బలవంతంగా పెళ్లి చేస్తారని భయపడి ఇంటి నుండి వెళ్లిపోయింది. అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన సంజు రాణి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో నుండి పీజీ చదివింది. అనంతరం యూపిఎస్సీ పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ర్యాంకు సంపాదించి కలెక్టర్ అయ్యింది. ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె తన చదువులు, ఇతర ఖర్చుల కోసం ట్యూషన్లు చెబుతూ ప్రైవేటు ఉద్యోగం చేసింది. ఏడేళ్ల పాటు కష్టపడి చదివి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
తాను ఇంటి నుండి వెళ్లిపోయిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కోపంతో ఉన్నారనీ, ఇప్పుడు తనను చూసి మెచ్చుకుంటున్నారనీ తెలిపింది సంజు రాణి. యూపీఎస్సీ అధికారి కావడం సంతోషంగా ఉందని చెప్పింది. కుటుంబ సభ్యుల పట్ల తన బాధ్యత తెలుసుననీ, ఇప్పుడు కుటుంబానికి అండగా ఉంటానని తెలిపింది. అమ్మాయిలను చదువుకోనివ్వకుండా పెండ్లి పేరుతో ఎవరూ ఒత్తిళ్లు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు సంజు రాణి. బాలికల లక్ష్యాలకు అనుగుణంగా వారి తల్లిదండ్రులు స్వేచ్చ ఇస్తే వారి భవిష్యత్తు బంగారుమయంగా తయారు చేసుకుంటారని సందేశం ఇచ్చింది సంజురాణి వర్మ.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?