సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఫ్లో ఇప్పుడు మాములుగా లేదు. మహేష్ వరసగా సూపర్ డూపర్ హిట్స్ ను కొడుతున్నాడు. మహేష్ కెరీర్ లో రీసెంట్ గా విడుదలైన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు మహేష్ బాబు.
అయితే ఈ చిత్రం తర్వాత నాలుగు నెలలు విరామం తీసుకుని తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెడదామని ఫిక్స్ అయ్యాడు. ఈలోగా కరోనా నేపథ్యంలో తన తర్వాతి సినిమా అనౌన్స్మెంట్ ఆలస్యమవుతూ వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న మహేష్ తర్వాతి చిత్రం సర్కారు వారి పాట సినిమాను అనౌన్స్ చేసారు.
గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. సంగీత దర్శకుడిగా సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు. ఈ పాటికే సర్కారు వారి పాట మ్యూజిక్ సిట్టింగ్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఇక సర్కారు వారి పాటకు సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్ ను ముందు తీసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యమవ్వడంతో పీఎస్ వినోద్ డేట్స్ వేస్ట్ అయిపోయాయి. ఈ కారణంగా పీఎస్ వినోద్ ఈ సినిమాకు పనిచేయట్లేదు. వినోద్ స్థానంలో సినిమాటోగ్రాఫర్ గా మధి పనిచేయనున్నాడు.
ప్రస్తుతం దర్శకుడు పరశురామ్, సినిమాటోగ్రాఫర్ మధి కలిసి యూఎస్ లో ఉన్నారు. వీరిద్దరూ షూట్ కు సంబంధించిన లొకేషన్స్ ను ఫైనల్ చేయనున్నారు. ఎందుకంటే సర్కారు వారి పాట షూట్ నవంబర్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా నేపథ్యం కారణంగా యూఎస్ లో కొంత భాగం షూట్ చేయాల్సి ఉంది. ఇందుకోసమే యూఎస్ లో తగిన లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నారు.