అక్కడ గ్రామ ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడానికి ప్రజలు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉంటే వేలం పాట ద్వారా పదవులను ఎంచక్కా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలు చేసే ఈ ఘటనలు మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. గ్రామంలో అభివృద్ధి పనులు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారే ఆ గ్రామాల్లో సర్పంచ్ లుగా అయిదేళ్లు పదవులను అనుభవిస్తారు. కొంత మంది గ్రామ పెద్దల గుత్తాధిపత్యంతో ఈ తతంగాలు జరుగుతూ ఉంటాయి. ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఓ పెద్దాయన రూ.2కోట్లు వెచ్చింది కొనుగోలు చేయడం విశేషం.
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని 36 జిల్లాలకు గాను 34 జిల్లాల్లోని 14,234 గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహణకు అక్కడి ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేశారు. జనవరి 15వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల్లో దక్కించుకునేందుకు పార్టీలు సమాయత్తం అవుతుండగా పలు గ్రామాల్లో కొందరు సర్పంచ్ పదవులను బేరానికి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి,. గ్రామాభివృద్ధి నిధికి రూ.25 వేల నుండి 50 వేల వరకూ ఇచ్చే వారిని సర్పంచ్ లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గతంలో చాలా చోట్ల జరిగాయి.
అయితే నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ తాలూకాలోని ఉమ్రానే అనే గ్రామ సర్పంచ్ పదవికి వేలంలో ఓ పెద్దాయన 2.05 కోట్లు చెల్లించడం పెద్ద చర్చనీయాశమైంది. ముందుగా ఆ గ్రామస్తులు సర్పంచ్ పదవికి ఆక్షన్ పెట్టాలని భావించలేదట. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు గ్రామంలో ఆలయ నిర్మాణంతో పాటు దాని నిర్వహణ బాధ్యతలు చూసేందుకు వేలం నిర్వహించాలని భావించారు. 1.11 కోట్ల తో వేలం ప్రారంభించగా విశ్వాస్ రావు దేవరే అనే పెద్ద మనిషి రూ.2.05 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.
అయితే సర్పంచ్ పదవులను ఆక్షన్ ద్వారా ఎంపిక చేయడాన్ని సామాజిక కార్యకర్త జేడియో డోల్ తప్పుబడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రతినిధులను సరైన పద్ధతిలో ఎన్నుకోవాలే కానీ ఇలా ఆక్షన్ ద్వారా పదవులను పొందడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు.