Gram Panchayat sarpanches: గ్రామాల్లో సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా ఎన్నిక అవుతున్నా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా అంటూ ఉంటారు. గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు, తమ హయాంలో ఈ పనులు చేశాము అని చెప్పుకునేందుకు తహతహలాడుతుంటారు. గ్రామాల్లో ఎన్నికలను ఆయా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు. అయితే ఎన్నో ఆశలతో సర్పంచ్ లు గా గెలిచిన వారు పంచాయతీల్లో నిధుల లేమి కారణంగా ఏమి చేయలేక ఉత్సవిగ్రహాలుగా మిగిలిపోతున్నామన్న భావన వారిలో కలుగుతోంది. ఏపిలో పంచాయతీల ఆర్ధిక సంఘం నిధులను ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు వాడేయడం తెలిసిందే.
గ్రామ పంచాయతీల ఆమోదం లేకుండా నిదులను లాగేసుకోవడంపై మెజార్టీ సర్పంచ్ లు ఆందోళన కూడా చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా కడప కేంద్రంలో రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అధికార వైసీపీకి చెందిన సర్పంచ్ లే అధిక శాతం మంది ఉండటం గమనార్హం. ఏపిలో ఇంత వరకూ రాజీనామాలకు సిద్దం కాలేదు గానీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా సర్పంచ్ లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లాలోని వాంకిడి మండలానికి చెెందిన 18 మంది ఆదివాసీ సర్పంచ్ లు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019 లో పార్టీలో చేరామనీ, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తాము గెలిచి అధికారం చేపట్టిన తొలి రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు రాలేదని, దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అయితే సర్పంచ్ ల రాజీనామాపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే అత్రం సక్కు స్పందించారు. తాను సర్పంచ్ లతో చర్చలు జరిపి వారికి నచ్చజెబుతానని, సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో సర్పంచ్ లు నిన్న మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు తమకు తెలియకుండా అధికారులు డ్రా చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సర్పంచ్ లు ఎదుర్కొంటున్న పరిస్థితి తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు ఏపిలోనూ నెలకొని ఉంది. ఏపిలో కూడా సర్పంచ్ ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో వీరు అదే బాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
చంద్రబాబు కనీసం రెండు సీట్లయినా వచ్చేలా శ్రమపడితే మంచిదని సలహా ఇచ్చిన విజయసాయి రెడ్డి