అమరావతి : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో గల సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై ప్రభుత్వం అపార ప్రేమ కురిపిస్తూనే ఉంది. ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారో లేక నిబంధనల ప్రకారం చేస్తున్నారో లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో కానీ ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. నెల క్రితమే ఈ సంస్థకు కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీ (2.19 క్యూసెక్కులు)ల నీటిని జీవితకాలం అందించేందుకు ఆమోద ముద్ర వేసింది జగన్ సర్కార్. వెయ్యి గాలన్ల నీటిని రూ.5.50కి అందించాలని జల వనరులశాఖ నిర్ణయించింది. సరస్వతి పరిశ్రమకు ఐదేళ్ల పాటు నీటిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఏడాది తిరగకుండానే జీవితకాలానికి మార్చడం పారిశ్రామిక వర్గాల్లో నాడు చర్చకు దారి తీసింది. నేడు మైనింగ్ లీజును ఏకంగా 50 ఏళ్ళు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ కంపెనీకి 613.70 హెక్టర్ లో మైనింగ్ లీజును 50 ఏళ్ల పాటు కేటాయిస్తూ నిన్న ప్రభుత్వం జివో 30ని విడుదల చేసింది.
ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఆదిరాజు వేణుగోపాల్రాజు, జెల్లా జగన్మోహన్రెడ్డి, నల్ల రామగంగిరెడ్డి ఉండగా కంపెనీలో జగన్ కు 26.4 కోట్లు విలువ చేసే షేర్లు వాటా, ఆయన భార్యకు 13.8కోట్ల విలువ చేసే షేర్ల వాటా ఉంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కంపెనీకి దాచేపల్లి, మాచవరం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భూములను సేకరించారు. ప్రైవేట్ వ్యక్తుల నుండి కూడా భూములను తీసుకున్నారు. ఆ సమయంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్ది తండ్రే సీఎంగా ఉండటంతో అన్ని అనుమతులు వచ్చాయి. అయితే వైఎస్ఆర్ అకాల మరణం, జగన్ కేసుల్లో ఇరుక్కోవడం కారణంగా కంపెనీ సకాలంలో ప్రారంభం కాలేదు. దీనితో నాడు భూములు ఇచ్చిన రైతులు సాగుకు సమాయత్తం కాగా కొంత మంది వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం. వారిపై పోలీస్ కేసులు నమోదులు జరిగాయి. అయితే చంద్రబాబు ముఖ్య మంత్రి అయిన తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఈ ప్రాజెక్టు అనుమతులను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది.
2019లో జగన్మోహన్ రెడ్ది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కంపెనీకి అన్ని అనుమతులు, శాశ్వితంగా నీటి కేటాయింపులు, ఎప్పుడు ఏకంగా 50 ఏళ్ళు మైనింగ్ లీజ్ లు లభించాయి.
ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ విధంగా అనుమతులు ఇచ్చివుంటే ప్రత్యర్ధులు నానా హంగామా చేసే వారనీ, నేడు మాత్రం ఎవరు ఏమి మాట్లాడటం లేదని అంటున్నారు.