SBI alert: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఈబీ) తన ఖాతాదారుల భద్రత కోసం సరికొత్త చర్యలు తీసుకుంది. అయితే ఇకపై యోనో యాప్ ను వినియోగించే ఖాతాదారులు భద్రతా నియమాలు పాటించకపోతే వారి అకౌంట్లను స్తంభింపజేస్తామని స్పష్టం చేసింది.
ఖాతాదారులు బ్యాంకుల వద్దకు రాకుండానే నేరుగా వారు ఉన్న చోట నుండి నగదు లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ఎస్బీఐ తన యోనో యాప్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఎస్బీఐ ఖాతాదారులందరూ దీనిని వినియోగించుకుంటున్నారు. యోనో యాప్ వినియోగానికి సంబంధించి ఇప్పుడు ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. యోనో యాప్ లోకి లాగిన్ అవ్వడానికి ఇకపై ఏ మొబైల్ నెంబర్ అయితే బ్యాంకులో రిజిస్టర్ చేశారో ఆ నెంబర్ తోనే లాగిన్ అవ్వాలి. మరో నెంబర్ ద్వారా ఈ ప్రయత్నం చేస్తే అది ఫలించకుండా బ్యాంకు యోనో యాప్ లో మార్పులు చేసింది. ఈ నియమాన్ని వినియోగదారులు కఛ్చితంగా పాటించాల్సిందేనని ఎస్బీఐ పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని ఎస్బీఐ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. “యోనో యాప్ తో సురక్షితంగా బ్యాంకింగ్ సదుపాయాలు వినియోగించుకోండి. యోనో యాప్ భద్రతా ప్రమాణాలను మరింత పెంచాం. ఇకపై బ్యాంకులో నమోదు చేసుకున్న నెంబర్ తో మాత్రమే యోనో యాప్ లోకి లాగిన్ అవ్వగలరు” అని ట్వీట్ లో పేర్కొంది. వేరే నెంబర్ నుండి ప్రయత్నిస్తే వారి ఖాతాలను స్తంభింపజేస్తామని ఎస్బీఐ స్పష్టం చేసింది.