ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓ నూతన సదుపాయాన్ని ఆ బ్యాంక్ తన ఖాతాదారులకు కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఏటీఎంలలో డెబిట్ కార్డులతో నగదు లావాదేవీలు చేస్తేనే కస్టమర్లకు మెసేజ్లు వచ్చేవి. అయితే ఇకపై వారు ఏటీఎంలలో బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ ఎంక్వయిరీలు చేసినా వారికి మెసేజ్లు వస్తాయి. ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఎస్బీఐ ట్వీట్ చేసింది.
చాలా వరకు ఏటీఎం మోసాలకు పాల్పడేవారు ముందుగా ఖాతాదారులకు చెందిన బ్యాంకు అకౌంట్లలో నగదు ఎంత ఉందో తెలుసుకుని తరువాత అందులో నుంచి డబ్బు కాజేస్తారు. అందుకు వారు ముందుగా బ్యాలెన్స్ ఎంక్వయిరీ లేదా మినీ స్టేట్మెంట్ ఎంక్వయిరీ చేస్తారు. దీంతో వినియోగదారుడి ఖాతాలో ఎంత నగదు ఉందో తెలిసిపోతుంది. తరువాత వారు ఆ మొత్తానికి అనుగుణంగా డబ్బు కాజేస్తారు. అయితే మోసగాళ్లు బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ ఎంక్వయిరీ చేయగానే కస్టమర్లకు మెసేజ్ వస్తే.. దాంతో కస్టమర్లు అలర్ట్ కావచ్చు. వారు ఆ ఎంక్వయిరీలను చేయకపోతే వెంటనే కార్డును బ్లాక్ చేసి డబ్బు కోల్పోకుండా చూసుకోవచ్చు. ఇలా ఈ సదుపాయం పనిచేస్తుంది.
కాగా ఎస్బీఐ ఇప్పటికే కాంటాక్ట్లెస్ పద్ధతిలో తన కస్టమర్లు ఏటీఎంలలో నగదును విత్డ్రా చేసుకునే సదుపాయం అందిస్తోంది. ఎస్బీఐ యాప్లో ముందుగా ఓటీపీ పొందడం ద్వారా ఏటీఎంలో ఆ ఓటీపీని ఎంటర్ చేసి కార్డు లేకుండానే నగదు విత్డ్రా చేయవచ్చు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన పైన తెలిపిన ఆ సదుపాయం వల్ల ఏటీఎం కార్డు మోసాలను మరింత అరికట్టేందుకు వీలు కలుగుతుంది.