స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా డెబిట్ కార్డు వినియోగదారులకు మరొక కొత్త సేఫ్టీ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ఎస్బీఐ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను సులభంగా బ్లాక్ చేసుకోవచ్చు. కార్డు పోయిందని భావించిన వారు వెంటనే ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కార్డును బ్లాక్ చేయవచ్చు. దీంతో కస్టమర్ కేర్ కన్నా చాలా వేగంగా కార్డును బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఎస్బీఐ డెబిట్ కార్డు వినియోగదారులు పోయిన తమ కార్డును బ్లాక్ చేయాలంటే.. ముందుగా తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ రికార్డుల్లో అప్డేట్ చేసుకుని ఉండాలి. తరువాత ఆ నంబర్ ఉన్న ఫోన్తో BLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డెబిట్ కార్డు చివరి 4 అంకెలను టైప్ చేయాలి. అనంతరం ఆ మెసేజ్ను 567676 అనే నంబర్కు పంపించాలి. దీంతో కార్డు బ్లాక్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో టిక్కెట్ నంబర్ ఉంటుంది. అలాగే కార్డు బ్లాక్ అయిన తేదీ, సమయం తదితర వివరాలు ఉంటాయి. ఇలా ఎస్బీఐ కస్టమర్లు తమ డెబిట్ కార్డులను సులభంగా బ్లాక్ చేయవచ్చు.
అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా డెబిట్ కార్డులను బ్లాక్ చేయవచ్చు. అందుకుగాను www.onlinesbi.com అనే సైట్లోకి లాగిన్ అయి ATM Card Services లో ఉండే e-Services అనే ట్యాబ్లోని Block ATM Card అనే లింక్ను ఎంచుకోవాలి. అనంతరం వచ్చే పేజీలో యాక్టివ్, బ్లాక్ అయి ఉన్న అన్ని కార్డుల వివరాలు ప్రత్యక్షమవుతాయి. అందులో కార్డులకు చెందిన మొదటి, చివరి 4 అంకెలు కనిపిస్తాయి. ఏదైనా కార్డును ఎంచుకుని కింద సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే వివరాలను వెరిఫై చేయాలి. ఓటీపీ ద్వారా లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా ఆథెంటికేషన్ ఇవ్వాలి. దీంతో రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది. అనంతరం కార్డు బ్లాక్ అయినట్లు మెసేజ్ వస్తుంది. అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కార్డు బ్లాకింగ్ సర్వీస్ ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. ఎస్బీఐ తాజాగా ఎస్ఎంఎస్ ద్వారా కూడా డెబిట్ కార్డును బ్లాక్ చేసేలా కొత్త సేఫ్టీ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.