టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఒకరి ఆస్తుల తెలుసుకోవడానికి మీరెవరు అంటూ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలుగా ఆలోచించే ఈ పిటిషన్ ను కొట్టివేసిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఎవరి ఆస్తులు .. ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదని పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు.
గతంలో హైకోర్టులోనూ లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సుప్రీం లో లక్ష్మీపార్వతి సవాల్ చేయగా దిగువ కోర్టు తీర్పునే సమర్ధిస్తూ ఆమె పిటిషన్ ను డిస్మిస్ చేసింది. చంద్రబాబు అదాయానికి మించి ఆస్తులు సంపాదించారనడానికి ఆధారాలు లేవని గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పును వెల్లడించాయి. చంద్రబాబుకు లక్ష్మీపార్వతికి మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయాన్ని గతంలో హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు చాలా చక్కగా ఉందని న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.