జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ ఫార్మా కంపెనీ హటిరో కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమ పై సీబీఐ కేసు నమోదు చేయడాన్ని హెటిరో సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తొలుత కేసు క్వాష్ కోసం సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టును హెటిరో ఆశ్రయించగా, ఆ కోర్టులు నిరాకరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది హెటిరో.
హెటిరో పిటిషన్ పై సుప్రీం కోర్టులో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జోసెఫ్ ల నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. హెటిరో సంస్థపై కేసు కొట్టివేయదగినది కాదని ధర్మాసనం పేర్కొంది. జగన్ సంస్థలో హెటిరో పెట్టుబడులు పెట్టిందనీ, ఆ తర్వాత హెటిరోకు 80 ఎకరాలు కేటాయించారని ధర్మాసనం స్పష్టం చేసింది. సీబీఐ పక్కాగా చార్జిషీటు దాఖలు చేసినందున హెటిరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ సందర్భంలో హెటిరో గ్రూపు మొత్తాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం సరికాదని ఆ సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కంపెనీ సిబ్బందిపై కేసు పెట్టాలి కానీ కంపెనీపై కాదని విన్నవించారు. అయితే ఈ వాదనలను సుప్రీం ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. హెటిరో సంస్థల పిటిషన్ ను తోసిపుచ్చింది.