(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై సుప్రీం కోర్టులో కోర్టు దిక్కరణ కేసు వాయిదా పడింది. విచారణ ధర్మాసనం నుండి జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. మరో ధర్మాసనానికి ఈ పిటిషన్ బదిలీ చేయాలని జస్టిస్ లలిత్ సూచించారు. కేసులో ఉన్న వ్యక్తుల తరపున తాను గతంలో న్యాయవాదిగా వ్యవహరించినందున ఈ కేసు విచారణలో తాను పాల్గొనదల్చుకోలేదని జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. దీంతో ఈ కేసు వాయిదా పడింది.
ఏపి సీఎం జగన్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులు జీఎస్ ముని, సునీల్ కుమార్ సింగ్ కోర్టులో దిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిరంగరపర్చడంపై జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. సుప్రీం న్యాయమూర్తి ఎన్ వి రమణపై నిరాధార ఆరోపణలు చేశారనీ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ చర్యలు ఉన్నాయని వారు సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు వాటిని బహిర్గతం చేయడం ద్వారా జగన్ న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని పేర్కొన్నారు.