ఏపి రాజధాని అమరావతి అంశంపై ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లబించలేదు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తుంది, ఆ వెంటనే మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేసి విశాఖకు మకాం మార్చి అక్కడి నుండి పరిపాలనా రాజధానిగా పాలన సాగిద్దామని అనుకున్న వైసీపీ పాలనకుల ఆశలకు నీళ్లు చల్లేలా సుప్రీం కోర్టు ఈ పిటిషన్ల పై విచారణను జూలై 11నకు వాయిదా వేసింది. అమరావతి పిటిషన్ లపై విచారణ త్వరగా పూర్తి చేయాలంటూ ప్రభుత్వ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ నిరాకరించారు.
ఏపికి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని అమరావతి రైతులు.. మరో వైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ కేఏం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం సుదీర్గంగా విచారించింది. పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలనీ లేకుంటే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా రెండింటికీ ధర్మాసనం నిరాకరించింది.
మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అర్ధం లేదని ఏపి ప్రబుత్వం తరపునన సీనియర్ కౌన్సిల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే.. ఏపి ప్రబుత్వ న్యాయవాదుల విజ్ఞప్తులను న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న తాను పదవీ విరమణ చేయనున్నాననీ, ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయనీ, సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని జస్టిస్ కేఎం జోసెఫ్ తెలిపారు. కావున విచారణను జూలై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంత మంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమతి కోరగా అందుకు అనుమతిస్తూ.. వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులను దర్మాసనం ఆదేశించింది.
అంతకు ముందు ఏపి ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 8వ నెంబర్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ధర్మాసనం ముందు అమరావతి కేసు ను ప్రస్తావించేందుకు ఏపి ప్రభుత్వ న్యాయవాదులు ప్రయత్నించారు. దీంతో జస్టిస్ జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. అమరావతి పిటిషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపి తరపున సీనియర్ న్యాయవాదులు నఫ్టే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఈ కేసు సగం విచారణలో ఉండగా మరో కేసు ఎలా విచారించాలి అని న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి ఆగ్రహంతో న్యాయవాదులు మిన్నకుండిపోయారు.
కీలక నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి