దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్కు ఇప్పటికే ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్కు అనుమతులు రాగా, జూలై 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 12 ఇనిస్టిట్యూట్లలో ఆ వ్యాక్సిన్కు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇక మెడిసిన్కు ట్రయల్స్ను వేగంగా పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీ వరకు దాన్ని ప్రజలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఐసీఎంఆర్ ఇప్పటికే భారత్ బయోటెక్కు లేఖ రాసింది. అయితే దీనిపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందరూ తలోమాట మాట్లాడుతున్నారు.
ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్కే కొన్ని నెలల సమయం పడుతుందని, అలాంటిది కేవలం 45 రోజుల్లోనే ఆ ట్రయల్స్ను పూర్తి చేసి మెడిసిన్ను ఎలా అందుబాటులోకి తెస్తారని సైంటిస్టులు, వైద్య నిపుణులు సందేహం వ్యక్తం చేశారు. అయితే దీనికి ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే వ్యాక్సిన్ ట్రయల్స్ను వేగంగా పూర్తి చేస్తామని తెలిపింది. అందుకు గాను అవసరం అయ్యే అనుమతులు, ఇతర అంశాల విషయంలో వేగంగా స్పందిస్తున్నామని, దీంతో ట్రయల్స్కు పట్టే సమయం తగ్గుతుందని, త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. అందుకనే కోవ్యాక్సిన్కు వేగంగా ట్రయల్స్ చేపట్టాలని భారత్ బయోటెక్కు సూచించామని ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది. అయితే మళ్లీ దీనిపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సందేహం వ్యక్తం చేసింది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ 2021కి ముందు వచ్చే అవకాశం లేదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో భారత్ బయోటెక్కు చెందిన కోవ్యాక్సిన్తోపాటు కాడిలా హెల్త్కేర్కు చెందిన జైకోవ్-డి వ్యాక్సిన్లకు ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆ శాఖ తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 వ్యాక్సిన్లకు గాను ఫేజ్ 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా.. వాటిలో ఏ వ్యాక్సిన్ కూడా ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని.. 2021 ఆరంభంలో వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉందని ఆ శాఖ వ్యాఖ్యానించింది.
అయితే మరోవైపు భారత్ బయోటెక్ ప్రతినిధులు మాత్రం క్లినికల్ ట్రయల్స్కే ఎంత వేగంగా పని చేసినా కనీసం 15 నెలల సమయం పడుతుందని గతంలో చెప్పారు. దీంతో తాజాగా సైన్స్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనతో మరోసారి కోవ్యాక్సిన్పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం.. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల దృష్ట్యా మోదీ ప్రజల ఓట్లను తమ వైపుకు వచ్చేలా చేసుకునేందుకే ఆగస్టు 15కే వ్యాక్సిన్ను పంపిణీ చేస్తామని చెబుతున్నారని అంటున్నాయి. ప్రజల ఓట్ల కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టవద్దని సూచిస్తున్నాయి. అయితే సైన్స్ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై ఐసీఎంఆర్ ఏమని స్పందిస్తుందో చూడాలి.