(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏపిలో అతి త్వరగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తున్నది. ఇందు కోసం వేగంగా అడుగులు వేస్తున్నది. అయితే జిల్లాల ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకుంటోంది.
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే వివిధ సమస్యల కారణంగా అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసి మొత్తం 26 జిల్లాలుగా విభజించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. ఈ క్రమంలోనే జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ సోమవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. పలు సూచనలు చేశారు. పోలీసు యంత్రాంగం కూడా కొత్త జిల్లాలపై కసరత్తు ప్రారంభించింది.
ఇది ఇలా ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత మార్చి నెలలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇది కారణంగా చూపి రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు ఎస్ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందనీ, అది పూర్తి అయ్యే వరకూ జిల్లాల పునర్విభజన చేయడం తగదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రాష్ట్రంలో 13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు గనుక జిల్లాల విభజన జరిగితే జిల్లా పరిషత్ ఎన్నికలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. ఇవి కారణాలుగా చూపుతూ ఎస్ఈసీ.. ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఎస్ఈసీ అభ్యంతరాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. వైసీపీ పెద్దలు ఎమంటారో వేచి చూడాలి.