(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీకి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని ఏపి హైకోర్టు పేర్కొన్నది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నామని రమేష్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి గమనిస్తున్నామనీ, ప్రభుత్వ వైఖరితో ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం బాధాకరమనీ ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘానికి రూ.40 లక్షలకు గానూ రూ.39 లక్షల నిధులు విడుదల చేశామనీ, దీనిపై అదనంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదనీ, ఎస్ఈసీకి ఏమైనా అవసరం ఉంటే తమను సంప్రదించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. తాము గమనిస్తే తప్పేమిటి ? ఒక రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ప్రతిదానికీ వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించాలా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న ఇబ్బందులను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీతారామమూర్తి, అశ్వినీ కుమార్ లు వాదనలు వినిపించారు.