గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. దీంతో రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నానికి రామన్నగూడెంలో 9.840 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తుండగా, కొన్ని గంటల్లోనే 9.94 మీటర్లకు గోదావరి నీటిమట్టం పెరిగింది.
దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసి సహాయక చర్యలు చేపట్టారు. నీటిమట్టానికి మంగపేట పుష్కర ఘాట్ మొత్తంగా మునిగిపోయింది. పుష్కర్ ఘాట్ పై నుండి నీరు పంటపొలాల్లోకి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం గ్రామీణ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు అందుబాటులో లేవని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రానున్న గంటల్లో గోదావరి ఉగ్రరూపం మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.