అమిత్ షా నుంచి కబురే వచ్చిందో.. లేక జగనే వెళ్లి ఆయన కలిసారో గానీ.. జగన్ ఢిల్లీ వెళ్లడం రావడం జరిగింది. ఈ టూర్ పై ఎవరికి తోచింది వారు రాసుకున్నారు. రాష్ట్రానికి సాయం చేయాలని, విభజన హామీలు, జీఎస్టీ బకాయిలు.. ఇలా ఓ వర్గం రాసుకుంటే.. మరో వర్గం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై జగన్ ను అమిత్ షా హెచ్చరించారని రాసుకున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్యా ఏం జరిగిందో ఏ మీడియా కూడా రాయలేదు.
అందుకే అంత హడావిడిగా వెళ్లారేమో..
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏకు వైసీపీ ఆపద్భాంధవుడిలా మారింది. వ్యవసాయ బిల్లుకు వైసీపీ ఎంపీలు భేషరతుగా మద్దతు తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం సందర్భంలో కూడా వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. అనుకున్నట్టే వైసీపీ అవసరం కేంద్రానికి రాజ్యసభలోనే ఉంటుంది. అందుకుతగ్గట్టే కేంద్రం కూడా వైసీపీ పట్ల చూసీచూడనట్టే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ చేసిన సాయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకుందట. అందుతున్న సమాచారం మేరకు జగన్ ను ఎన్డీఏలో చేరాలని అమిత్ షా కోరినట్టు.. ఇందుకు జగన్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎంపీలతో ఓసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.
వైసీపీకి కేంద్ర మంత్రి పదవులు..ఏపీలో బీజేపీకి మంత్రి పదవులు..
త్వరలో జరిగే బీహార్ ఎన్నికల కంటే ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ఈలోపే వైసీపీని కేంద్రంలోకి తీసుకుని ఇద్దరు లేదా ముగ్గురికి క్యాబినెట్ హోదా మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ నేతలు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లూ అంతర్గతంగా ఉన్న వైసీపీ-బీజేపీ మైత్రి ఇప్పుడు బహిర్గతం కానుంది. ఇదే జరిగితే రాష్ట్రానికి అవసరమైన విభజన హామీలు, ప్రత్యేకహోదా తెరపైకి వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.