అతను వెలగబెట్టేది భాద్యతాయుతమైన గ్రామ సచివాలయ కార్యదర్శి ఉద్యోగం. కార్యాలయంలో కింది స్థాయి సిబ్బందిని కన్న బిడ్డలుగా, సోదరి సోదర మానులుగా చూసుకోవాల్సి ఉండగా బుద్ది వక్ర మార్గం పట్టింది. కూతురు వయసు ఉండే మహిళా వాలంటీర్ తో ప్రేమాయణం సాగించి, రెండో పెళ్లికి సైతం సిద్దపడి అడ్డంగా బుక్ అయ్యాడు ఆ ప్రబుద్దుడు.
ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే….సయ్యద్ జాన్ పీరా దాచేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు పెళ్లి వయసుకు వచ్చారు. అతను నారాయణపురంలో భార్య పిల్లలతో కలిసి ఉండేవాడు. అయితే దాచేపల్లిలో పని చేసే ఓ మహిళా వాలంటీర్ తో పరిచయం ప్రేమగా మారింది. దాచేపల్లి నుండి పొందుగుల కార్యదర్శిగా బదిలీ అయినా ఆ వాలంటీర్ తో అతడు ప్రేమాయణం సాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వాలంటీర్ తో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.
అయితే అతని విషయం తెలిసిన వెంటనే యువతి తల్లి దండ్రులు ఈ పెళ్ళికి అభ్యంతరం తెలపడంతో పెళ్లి పెటాకులైంది. జాన్ పీరాపై పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే వారి ఫిర్యాదుకు భిన్నంగా ఆ వాలంటీర్ తల్లిదండ్రులపైనే ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యదర్శి, వాలంటీర్ ప్రేమ వ్యవహారం ఉద్యోగులు, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.