శ్రీనగర్ : పుల్వామాలో భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు బుధవారం రాత్రి భగ్నం చేశాయి. 2019 లో 40 మంది సీ ఆర్ పి ఎఫ్ జవాన్ లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు మరో మారు అదే తరహా కుట్ర అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీసీ ఆర్ పి ఎఫ్, ఆర్మీ, పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
బాంబు అమర్చిన కారులో ఒక ఉగ్రవాది సంచరిస్తున్నట్లు ఇటీవల పుల్వామా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. బుధవారం రాత్రి ఒక ప్రదేశంలో అనుమానిత వాహనం అక్కడకు చేరడంతో భద్రతా బలగాలు వెంటనే దానిపై కాల్పులు జరపడంతో . వాహనంలో ఉన్న వ్యక్తి పరారయ్యాడు. ఈ వాహనం వెనుక భారీ డ్రమ్ములో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తించిన అధికారులు మరింత అప్రమత్తమై, బాంబు నిర్వీర్య బృందాలను పిలిపించారు. అయితే వారు కూడా వాహనంతో భారీ ప్రమాదం పొంచి ఉందని తేల్చడంతో ఆ కారును బలగాలు పేల్చేశాయి. ఘటన సమయంలోనే స్థానికులను అక్కడి నుంచి దూరప్రాంతాలకు తరలించారు.