కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా .. అయిదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో బంధం కలిగి ఉండి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పలు కీలక హోదాలు నిర్వహించిన గులాం నబీ ఆజాద్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతల్లో ఒకరైన గులామ్ నబీ ఆజాద్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అయిదు పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. త్వరలో సీడభ్యుసీ సమావేశం నిర్వహించి పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యుల్ విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో గులాం నబీ ఆజాద్ పార్టీని వీడారు. తన రాజీనామా సందర్భంలో గులాం నబీ ఆజాద్ .. రాహుల్ పై వ్యవహారాల శైలిని తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
గులాం నబీ ఆజాద్ పార్టీ అధినాయకత్వంపై చాలా కాలంగా అసంతృప్తి గా ఉన్నారు. పార్టీ విధానాలు, అంతర్గత వ్యవహారాల గురించి ఆయన బాహాటంగానే విమర్శలు గుప్పించారు. 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన జీ 23 గ్రుపు నేతల్లో ఆజాద్ ఒకరు. 50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం తనకు బాధేస్తుందని పేర్కొన్నారు ఆజాద్. తాను రాజీనామా ఎందుకు చేయాల్సింది వచ్చిందో లేఖలో వివరించారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ నాశనం అయ్యిందని, పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ ప్రస్తుతం లేకుండా పోయిందన్నారు. సీనియర్ లను రాహుల్ గాంధీ పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీది చిన్న పిల్లల మనస్థత్వం అని, ఈ పరిస్థితి రావడానికి కారణం ఆయనేనని ఆజాద్ పేర్కొన్నారు.