వరంగల్లు జిల్లాలో సీఎం కేసిఆర్ కు సన్నిహితుడుగా పేరున్న సీనియర్ నేత రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన రాజయ్య యాదవ్ .. టీఆర్ఎస్ లో పరిస్థితులు, సీఎం కేసిఆర్ పై చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేసిఆర్ వెంట నడిచారు రాజయ్య యాదవ్. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. నాడు కేసిఆర్ తో పాటు ఆమరణ దీక్ష దిగిన ఆరుగురు సీనియర్ నేతల్లో రాజయ్య ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టు అయి ఖమ్మం జైలులో కేసిఆర్ తో పాటు గడిపారు రాజయ్య యాదవ్. రాజయ్య యాదవ్ గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు ఈ రోజు ప్రకటించిన రాజయ్య..కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పార్టీలో కొనసాగిన తాను కేసిఆర్ తో సన్నిహితంగా మెలిగాననీ, ఇప్పుడు చాలా కష్టంగా పార్టీకి వీడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కేసిఆర్ లో మార్పు వచ్చిందని, గతంలో మాదిరిగా సీనియర్ ను గౌరవించడం లేదని విమర్శించారు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. తన తనయుడు కేటిఆర్ కోసం పార్టీ సీనియర్ ను కేసిఆర్ తొక్కేస్తున్నారని ఆరోపించారు రాజయ్య యాదవ్. ఇప్పుడు పార్టీతో సంబంధం లేని వాళ్లు, బయటి వాళ్లదే టీఆర్ఎస్ రాజ్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండా పోయిందని అన్నారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
పార్టీలో కొందరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారనీ, ఇది మంచి పద్దతి కాదని అన్నారు రాజయ్య. ప్రస్తుతం వాళ్ల సమయం నడుస్తొంది.ఇలా వ్యవహరించిన పార్టీలు రాజకీయ చరిత్రలో కనుమరుగైన సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని రాజయ్య హితవు పలికారు. ఆత్మగౌరవం లేని చోట ఎవరూ ఉండరనీ, రేపో మాపో మరి కొందరు పార్టీని వీడతారని చెప్పారు రాజయ్య. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ యే కానీ ఆ పార్టీ బలహీనంగా ఉందని అందుకే ఎక్కువ మంది బీజేపీ వైపు చూస్తున్నారని రాజయ్య చెప్పారు. బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని రాజయ్య పేర్కొన్నారు. త్వరలో టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక దాదాపు కన్పర్మ్ అవ్వడం, తాజాగా సీనియర్ టీఆర్ఎస్ నేత రాజయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసి పార్టీని వీడటంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్లే అవుతోంది.
క్యాసినో చీకోటి వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని