తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం సంచలనం రేపింది.మంత్రితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి, మరో ఐదుగురు అనుచరులపైనా దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తప్పుడు పత్రాలు సృష్టించి సూరారంలో 20 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారనేది మంత్రిపై వచ్చిన అభియోగం. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆస్పత్రుల మధ్య ఉన్న భూమిని బలవంతంగా ఆక్రమించుకోవడమేగాక, మిగిలిన భూమిని కూడా అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పొన్నబోయిన శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. తనకు మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.శ్యామలాదేవి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని సర్వేనంబరు 115, 116, 117లో స్థానికంగా ఉండే పొన్నబోయిన శ్యామలాదేవి తల్లి పద్మావతి పేరున 2 ఎకరాల అది మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉంది.
ఆ భూమిని తనకు విక్రయించాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. అంతేకాదు 20 గుంటల భూమిని కబ్జాచేసి ప్రహరీగోడను నిర్మించారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వివాదంలో మల్లారెడ్డి అనుచరులు అనేకసార్లు శ్యామలాదేవిని, సోదరిని, తల్లి పద్మావతిని బెదిరించారు.ఈ నేపథ్యంలో శ్యామలాదేవి కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణ అనే న్యాయవాదిని సంప్రదించామని తెలపారు…. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి.. న్యాయవాదిని మచ్చిక చేసుకొని… స్టాంప్ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకురావాలని సూచించారని… ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకని చెప్పి స్టాంప్ పేపర్లపై తన సంతకం, ఆమె తల్లి పద్మావతి, సోదరి సంతకాలు తీసుకుని.. వాటిని మంత్రి మల్లారెడ్డికి ఇచ్చారని తెలిపారు… వాటిపైనే భూమి విక్రయం జరిగినట్లుగా మార్చేశారని… మంత్రి అనుచరుడు గూడూరు మస్తాన్కు భూవిక్రయం జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని శ్యామలా దేవి ఆరోపించారు..
కొంత కాలం తర్వాత శ్యామలాదేవి తల్లి, సోదరి మరణించారు. మిగతా భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయకుంటే చంపేస్తామని మంత్రి, ఆయన అనుచరులు శ్యామలాదేవిని భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. అయితే పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో శ్యామలాదేవి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బాధ్యులపై కేసు నమోదు చేయాలని దుండిగల్ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డి , భద్రారెడ్డి, ఎం.రాజు, న్యాయవాది లక్ష్మీనారాయణ, మస్తాన్, పుల్లయ్య, చంద్రయ్యలతో పాటు మరికొందరిపై ఐపీసీ 447, 506 రెడ్విత్ 34 సెక్షన్ల కింద ఈ నెల 6న కేసులు నమోదు చేశారు.ఇదిలా ఉంటే దుండిగల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.