తెలంగాణలో రాజకీయం రంజుగా మారిన సంగతి తెలిసిందే. టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం , హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయంతో గులాబీ పార్టీకి ఎదురులేదని అంతా అనుకున్నారు.
అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీద కనిపించిన టీఆర్ ఎస్ కు దుబ్బాక ఓటర్లు చుక్కలు చూపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా రెండు ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలతో రాబోయే ప్రతి ఎన్నికను సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
రెండేళ్లు… రెండు షాక్లు…
టీఆర్ఎస్ పార్టీ రెండో దఫా అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతోంది. మరోవైపు రెండు ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దుబ్బాకలో పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బొటాబొటీ విజయంతో ఇకపై జరిగే ప్రతి ఎన్నిక కీలకమేనని పార్టీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత హామీల అమలుకు ప్రయత్నించడంతో పాటు స్థానికంగా కొన్ని పనులకు శంకుస్థాపనలు చేయాలని చూస్తున్నారని అంటున్నారు.
ఎక్కడెక్కడ ఎన్నికలు?
త్వరలో ఎన్నికలు జరిగే చోట కొత్త పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉండటంతో గతంలో చెప్పిన హామీల్లో కొన్నింటిని అమలు చేసేందుకు పూనుకుంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో అక్కడా కొత్త పనులకు పచ్చ జెండా ఊపింది. ఐటీ పార్కులను ప్రారంభించి యువతలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తోంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నది.
షెడ్యూల్ తో సంబంధం లేకుండా…
ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా…టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉండేలా గులాబీ పెద్దలు వ్యూహాలు అమలు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా పనుల జాబితా తీయడమే కాకుండా ముఖ్యమైన వాటికి ప్రభుత్వ పరంగా ఓకే చేస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ షెడ్యూల్ వస్తే అభివృద్ధి నినాదం సమయం కలిసివస్తే మరికొంత కాలం పనులు చేసుకుంటూ ముందుకు సాగడం అనే ప్రణాళికలతో గులాబీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?