ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో మరోమారు సంచలన అంశం తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రోడ్లు మరియు బ్రిడ్జీల నిర్మాణం కోసం రూ.6,400 కోట్లతో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఆ సొమ్ములో 70 శాతం న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ రుణంగా ఇస్తే, మిగిలిన 30శాతం రాష్ట్రమే చెల్లించాల్సి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఈ సందర్భంగా మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు.
గతంలో ఏం జరిగింది?
గతంలో సంఘటనలు, ప్రస్తుత పరిణామాలు అవినీతికి అద్దం పడుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. “రోడ్లను అభివృద్ధి చేయడానికి ఆ నాటి ప్రభుత్వం ఎన్డీబీ నుంచి రుణం పొందాలని చూసింది. ఆనాడున్నప్రభుత్వం ఆర్ అండ్ బీ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకోవాలనుకున్న రుణాన్ని, వైఎస్ జగన్ జమానాలోని వైసీపీ ప్రభుత్వం అవినీతి కార్యక్రమాల్లో భాగంగా కాజేసేందుకు సిద్ధమైంది. 15నెలల్లో లక్ష కోట్ల అప్పు రాష్ట్రంపై పడేసిన జగన్, తన సొంత ఖజానా ఎలా నింపుకుంటున్నారో ఇటువంటి స్కామ్ లు బయటపెడుతుంటాయి.“ అని ఆరోపించారు.
అప్పటి ప్రణాళికల్లో…
“రోడ్లు, మరియు బ్రిడ్జీల నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రూ.6,400కోట్లతో ప్రణాళికలువేసి, అందులో 70శాతం నిధులను న్యూడెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్ డీబీ) నుంచి రుణంగా తీసుకుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ దేశాల గ్రూప్ సామూహికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2019లో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఎన్ డీబీ, గడచిన నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతి చూసే తాము రుణం ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ చూసే తాము ప్రభుత్వానికి రుణం ఇస్తున్నట్లు ఎన్ డీబీ చెప్పింది. అలా రాష్ట్రానికి రుణం ఇవ్వడానికి ముందుకొస్తే, దాన్ని జగన్ ప్రభుత్వం మింగేయాలని చూస్తోంది.“ అంటూ ఆరోపించారు.
రాయలసీమ మంత్రి, ఆయన కొడుకు
“ఎన్డీబీ బృందం 11-03-2019 నుంచి 15-03-2019 వరకు ఐదురోజులు రాష్ట్రంలో పర్యటించి, ఆర్ అండ్ బీ అధికారులతో, ఆర్థిక శాఖాధికారులతో చర్చలు జరిపింది. ఆ తరువాతే ఎన్ డీబీ రూ.6,400కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఆ సొమ్ముని కాజేయడానికి రాయలసీమకు చెందిన పవర్ ఫుల్ కేబినెట్ మంత్రి, ప్రజాప్రతినిధి అయిన ఆయన కొడుకు కలిసి పథక రచన చేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే రూ.6,400కోట్ల రోడ్లు, ప్రాజెక్టు పనులు పంచుకోవడానికి అంతా సిద్ధం చేశారు. అందులో భాగంగా ఫేజ్ -1 కింద, 7 జిల్లాల్లో రూ.1766 కోట్లకు ఈ ప్రొక్యూర్ మెంట్ విధానంలో టెండర్లు పిలిచారు. ఈ ప్రొక్యూర్ మెంట్ విధానం మొత్తం ఆన్లైన్లో జరగాల్సి ఉండగా, టెండర్లకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను బై హ్యాండ్ విధానంలో ఎస్ ఈ కార్యాలయాలకు పంపే నిబంధనను తీసుకొచ్చారు.“ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వాళ్లు రాకూడదనే..
“పారదర్శకతతో జరగాల్సిన టెండర్ల ప్రక్రియలో బై హ్యాండ్ ద్వారా టెండర్ పత్రాలు ఎందుకు ఎస్ ఈ కార్యాలయాలకు పంపాల్సి వచ్చింది? ఏ కంపెనీ వారు టెండర్లు వేశారో తెలుసుకొని, వారిని బెదిరించడానికే బైహ్యాండ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా తాము అనుకున్న, తమవి అనుకున్న కంపెనీలకు పనులు కట్టబెట్టాలని జగన్ ప్రభుత్వం కుట్ర పన్నింది. రూ.6,400కోట్ల టెండర్లను తన సొంత కంపెనీలకు, అనుచరుల కంపెనీలకు కట్టబెట్టడానికే అలా చేశారు. ఎన్డీబీ నిబంధన ప్రకారం బ్రిక్స్ దేశాలకు చెందిన కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనాలనే నిబంధన ఉందని, ఆయా దేశాల వారు వచ్చి, రాష్ట్రంలోని ఎస్ ఈ కార్యాలయాల ముందు నిలబడేలా చేస్తే, విదేశాల కంపెనీలు ఎలాగు రాకుండా చేయొచ్చనే కుట్ర కూడా ఇందులో ఉంది. ఇతర దేశాల్లోని కంపెనీలు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, రాష్ట్రానికి వచ్చి ఎస్ఈ కార్యాలయాల్లో సబ్ మిట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి, దానిద్వారా వారిని కూడా టెండర్లలో పాల్గొనకుండా ప్రభుత్వం తప్పించింది.“ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా, ఈ ఆరోపణలపై వైఎస్ జగన్ సర్కారు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?