వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో అభివృద్ధి – సంక్షేమం ఎజెండాతో పరిపాలన చేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి వివిధ నిర్ణయాలపై విపక్షాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. అయితే, తాజాగా జగన్పై ఊహించని విమర్శ తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ చేతితో ఇచ్చి… ఆ చేతితో లాక్కొని…
వైఎస్ఆర్ ఆసరా పేరుతో కీలక పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత అనురాధ విరుచుకుపడ్డారు. ఆసర పథకం లబ్ధిని ని గ్యాస్ రూపంలో లాగేశారని ఆరోపించారు. సంక్షేమ పథకాల్లోనూ జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో పాల్పడడం సిగ్గుచేటు అని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైఎస్ఆర్ ఆసరా పేరుతో డ్వాక్రా మహిళల రుణాలను చెల్లిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి గ్యాస్ రూపంలో లాక్కునేందుకు ప్లాన్ చేయడం అత్యంత దుర్మార్గం అని విరుచుకుపడ్డారు.
అప్పుడలా…. ఇప్పుడు ఇలా…
ఇప్పటి వరకు పెట్రోలియం ఉత్పత్తులపై 14.5శాతంగా ఉన్న వ్యాట్ ను 24.5శాతానికి పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.34 గ్యాస్ వినియోగదారులపై రూ.1500 కోట్ల భారం మోపారని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం ధరలు పెంచడం ద్వారా సుమారు రూ.60వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు గోరంత సాయం చేసి.. కొండంత దోచుకోవడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి సంక్షేమం పేరుతో హడావుడి చేస్తూ.. అభివృద్ధిని, ఆదాయ వృద్ధిని నీరు గార్చారని అనురాధ మండిపడ్డారు.
ఏంటిది జగన్?
గతంలో అమ్మ ఒడి అంటూ ఆర్భాటం చేసి మద్యం ధరలు పెంచి నాన్న బుడ్డీలో లాగేశారు అని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రైతు భరోసా, పెన్షన్ల ద్వారా అందించిన సొమ్మును.. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల్లో లాక్కున్నారని విరుచుకుపడ్డారు. వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన సొమ్మును పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దోచేశారని విమర్శించారు. ఇప్పుడు.. ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఇచ్చే సొమ్మును గ్యాస్ ధరలు పెంచి కొట్టేయడానికి ప్లాన్ చేశారు అంటూ ఆరోపించారు. ఆర్భాటంగా ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం గతంలో భూములు అమ్మాలని చెప్పి ఇప్పుడు పన్నులు పెంచడం, ధరలు పెంచడమే మార్గం అంటూ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆదాయం సృష్టించకుండా ఇలా సామాన్యులపై భారం వేయడం ఏ విధంగా సమంజసమో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజలపై భారం మోపి సంక్షేమం అమలు చేయాలనుకోవడం మాని.. ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కాగా, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల మనసు దోచుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి….ఇప్పుడు వాటి కోసం పన్నులు పెంచుతున్నారని టీడీపీ చేస్తున్న విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే.