కొన్ని డిమాండ్లు చిత్రంగా ఉంటాయి. ఇలా జరుగుతుందా? అనే సందేహం ఎదుటి వారికి వస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా కొందరు రాజకీయ నేతలు తమకు నచ్చిన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు పీసీసీ వ్యవహారం హాట్టాపిక్గా మారిపోయింది. నూతన రథసారథి ఎంపిక కోసం రంగంలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్.. అందరికీ సమయం ఇచ్చి మరీ.. అభిప్రాయాలు తీసుకుంటున్నారు.. ఇక, పీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన్ను కలిసి.. మనసులోని మాటలు చెప్పి
పీసీసీ పీఠంపై కన్నేసిన కోమటిరెడ్డి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఠాగూర్ను కలిశారు. పీసీసీ చీఫ్గా తనకు అవకాశం ఇవ్వాలని ఠాగూర్ని అడిగినట్టు కోమటిరెడ్డి తెలిపారు. దీనిపై రెండు పేజీల లేఖను కూడా ఠాగూర్కి ఇచ్చినట్టు వెల్లడించారు. ఇక, ఠాగూర్తో భేటీ తర్వాత కోమటిరెడ్డి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అక్కరలేదు….సీఎం పదవి పదవి వద్దు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కష్టపడతానని ప్రకటించారు.
నాకేం తక్కువ?
పీసీసీ అవకాశం ఇస్తే.. పార్టీని నిలబెడతాననే నమ్మకాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు. గతంలో కూడా పీసీసీ అడిగా కానీ ఇవ్వలేదు అని గుర్తుచేసుకున్న కోమటిరెడ్డి ఈ సారైనా అవకాశం ఇవ్వండి అని ఠాగూర్ని అడిగానని కోమటిరెడ్డి అన్నారు. పీసీసీ ఇవ్వగానే పాదయాత్ర మొదలుపెడతానన్న ఆయన చివరి వన్ ఇయర్లో సిటీలో ఉంటానని తెలిపారు. పాదయాత్రలో ఊరూరు తిరిగి ప్రభుత్వాన్ని నిలదిస్తా ప్రగతి భవన్ పునాదులు పెకిలిస్తానన్నారు. పీసీసీ అవకాశం కూడా వస్తుంది అని నమ్మకంతో ఉన్నట్టు వెల్లడించారు ఉత్తమ్.. పీసీసీ అడిగే వాళ్లలో నేను సమర్దున్నేనని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. నా మీద కేసులు ఏమీ లేవు.. భూ కబ్జా కేసులు లేవు.. నాకు పీసీసీ ఎందుకు ఇవ్వకూడదో ఒక్క కారణం చెప్పండి అని ఎదురు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేశా.. ఎన్ఎస్యూఐ నుండి పార్టీ కోసం పనిచేస్తున్నానని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్టీ లైఫ్ ఎండ్ డెత్ సమస్యలో ఉందని వ్యాఖ్యానించిన ఆయన.. నాకు సీఎం పదవి వద్దు… మంత్రి పదవి కూడా అక్కరలేదు.. పీసీసీ ఇస్తే.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కష్టపడతానన్నారు.