R.Narayana Murthy : కరోనా రెండోసారి వ్యాప్తిచెందటం అనేది బూటకమని ప్రముఖ విప్లవ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హాస్యానందం సంస్థ ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బహుళజాతి సంస్థలు తయారు చేసిన శానిటైజర్లు, మాస్క్లు, ఇతర మెడికల్ వస్తువులు అమ్ముకొని సొమ్ముచేసుకోవటానికే ఈ ఎత్తుగడ అన్నారు. ప్రభుత్వం కూడా కార్పొరేట్ సంస్ధలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
కరోనా వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే చాలా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీలు మాత్రం వేల కోట్లు దండుకున్నారన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రవేటీకరించటం దారుణమన్నారు. పంచ భూతాలను కూడా అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి అందరూ మద్దతు ప్రకటించాలని ఆర్.నారాయణమూర్తి కోరారు.
తెలంగాణను మళ్లీ కమ్మేస్తున్న కరోనా!
మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో… ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని… మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావంతో దేశంలో లాక్డౌన్ విధించి ఏడాది గడుస్తోంది. అప్పుడు పడ్డ ఇబ్బందులు, అనుభవించిన బాధలు.. వలస కార్మికుల కళ్లలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. తాజాగా.. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉండడం, తెలంగాణలోనూ క్రమంగా కేసులు పెరుగుతుండడంతో.. మళ్లీ లాక్డౌన్ పిడుగు పడుతుందేమోనని భయపడిపోతున్నారు. ఈ క్రమంలో.. ముందుగానే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.దేశవ్యాప్తంగా లాక్డౌన్కు కేంద్రం సుముఖంగా లేకపోయినా.. నగరాలు, పట్టణాల్లో పరిస్థితులను బట్టి.. మళ్లీ ఆంక్షలు మొదలవుతున్నాయి.ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా ప్రజలు మాత్రం ముందే సొంత ఊళ్లకు వెళ్లి పోయే మార్గాలు చూసుకుంటున్నారు.